చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-06-03T20:33:48+05:30 IST
జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, గుట్కా పాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం
చిత్తూరు: జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, గుట్కా పాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధమున్న అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడులలో సుమారు 50 లక్షల విలువైన 9,000 బాటిల్ల అక్రమ మద్యం, 48 వేల గుట్కా ప్యాకెట్లు, ఒక కారు, ఒక ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు రూరల్, తవణంపల్లి, జి.డి.నెల్లూరు పోలీసు స్టేషన్ పరిధులలోని పలు ప్రాంతాలలో పోలీసులు దాడులు నిర్వహించారు. తవణంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సాయినగర్ వద్ద గల ఒక గోడౌన్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు 10,00,000/- విలువ చేసే గోవా రాష్ట్రానికి చెందిన 3,552 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 15,00,000/- విలువ చేసే 42 వేల గుట్కా పాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 6 వేల విమల్ పాన్ మసాలా పాకెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సురేష్ బాబు, పూర్ణచంద్ర, ఖలీల్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
జి.డి.నెల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో మణినాయుడుకు చెందిన పొలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు రూ. 24,15,000/- విలువ చేసే 3,818 మద్యం బాటిళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుధాకర్ నాయుడు, కుమారస్వామి నాయుడు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.