వేడెక్కుతున్న హుజూరాబాద్ ప్రచారం
ABN , First Publish Date - 2021-10-19T05:58:37+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. అన్ని పార్టీల నుంచి అగ్రనేతలు నియోజకవర్గానికి వస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచార పర్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమవు తున్నారు.
ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్
27న పెంచికల్పేటలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ
రేపటి నుంచి బండి ప్రచారయాత్ర
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, విజయశాంతి రాక
కాక పుట్టించేందుకు కాంగ్రెస్ యత్నాలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. అన్ని పార్టీల నుంచి అగ్రనేతలు నియోజకవర్గానికి వస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచార పర్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమవు తున్నారు. ఈ నెల 27తో ప్రచారం ముగియనుండగా ఆయన అదేరోజు నియోజకవర్గానికి సమీపంలోని పక్క జిల్లా సరిహద్దు మండలంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం కొవిడ్ నేపథ్యంలో ప్రచార సభలకు కఠిన నిబంధనలు విధించి స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే బహిరంగ సభల్లో వెయ్యి మందికి మించి ఉండవద్దని తేల్చి చెప్పింది. దీంతో పక్కజిల్లా సరిహద్దుల్లోని ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నియోజకవర్గ ప్రజలను భారీ ఎత్తున అక్కడికి తరలించేందుకు టీఆర్ఎస్ ప్రణాళిక రూపొం దించుకొన్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగి హుజూరాబాద్ అన్ని రంగాల్లో ప్రగతిబాటన పయనించాలంటే టీఆర్ఎస్నే గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు ఇక్కడ నుంచి పిలుపునిస్తారని చెబుతున్నారు.
ఐదు నెలలుగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు
కేసీఆర్ పాల్గొననున్న సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు పర్యవేక్షిస్తు న్నారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ ఇతర నేతలతో కలిసి పెంచికల్ పేటకు వెళ్లి సభాస్థలిని పరిశీలించి అక్కడ విస్తృత మైన ఏర్పాట్లు చేసేందుకు పార్టీ నేతలకు అవసర మైన సూచనలు చేశారు. ఈ ఉప ఎన్నిక వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఆలోచనా విధానాలకు ప్రతిబింబంగా నిలుస్తుందని భావిస్తున్న రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిదో చాటుకోవాలంటే హుజూరాబాద్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఎత్తులకు పై ఎత్తులు
బీజేపీ, ఇటు టీఆర్ఎస్ అదే లక్ష్యంతో గెలు పు కోసం పోరుబాటలో పరుగులు పెడుతున్నా యి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యూహరచనను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కార్యా చరణను, వ్యూహాలను రూపొందిస్తూ మంత్రి హరీశ్రావు ఇక్కడ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈటల రాజీనామా తర్వాత ఐదు నెలలుగా సుదీర్ఘంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం గా హుజూరాబాద్ ప్రచార పర్వం రాజకీయ చరిత్రలో నమోదు కాను న్నది. ఈటలకు వ్యక్తిగతంగా ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇతరులకు సహాయ మందించే గుణం, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులు, ఆయనపై సానుభూతిని పెంచాయి.
బీజేపీకి పార్టీపరంగా ఇక్కడ పెద్దగా పట్టు లేకున్నా ఈటల ఆ పార్టీలో చేరడంతో ప్రధాన పోటీదారుగా మారారు. ఆయన బీజేపీలో చేరినరోజు నియోజకవర్గంలోని మెజార్టీ టీఆర్ఎస్ నాయకులు ఆయన వెంటే ఉండగా టీఆర్ ఎస్ మంత్రి హరీశ్రావు రంగంలో దిగి పరిస్థితిని మార్చేశారు. ఈటల వెంట వెళ్లిన టీఆర్ఎస్ నేతలను తిరిగి పార్టీలోకి వచ్చేలా చేయడంలో ఆయన ప్రయత్నాలు ఫలించాయి.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, తదితర పార్టీల్లోని పలువురు నాయకులను, ముఖ్య కార్యకర్తలను కూడా ఆయన ఆకర్షించి టీఆర్ఎస్లో చేరేలా చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీకి మరింత జవసత్వాలను ఇచ్చా రు. హరీశ్రావు రంగ ప్రవేశానికి ముందు ఈటల రాజేందర్, కేసీఆర్ల మధ్య జరుగుతున్న పోరుగా ఉన్న దానిని హరీశ్రావు రాజేందర్ మధ్య న పోరుగా మార్చేశారు. ఆ తర్వాత ఆయన కులాల వారీగా, వర్గాల వారీగా, వృత్తుల వారీగా, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి ఒక్కో ఓటరు రెండు లేక మూడు సభల్లో హాజర య్యేలా చూసి వారి మనస్సుల్లో టీఆర్ఎస్ ప్రచారం ఎక్కిం చే ప్రయత్నాలు చేశా రు. మంత్రులు గంగుల కమలా కర్, కొప్పుల ఈశ్వర్ హరీశ్ రావుతో పా టు హుజూరా బాద్లోనే మకాం వేసి పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో క్రియా శీలపాత్ర వహిస్తూ వస్తున్నా రు. వీరంతా మరో రెండేళ్లపాటు అధికారంలో ఉండేది టీఆర్ఎస్ పార్టే అయినందువల్ల పార్టీ అభ్యర్థిని గెలిపి స్తేనే అభివృద్ధి, సంక్షేమ పథ కాలు మరింత మెరుగ్గా కొనసాగే అవకాశాలుంటాయని ప్రజల్లో అభిప్రాయం కలిగించారు. హరీశ్ రావు ప్రచారపర్వంలో ఈటలపై వ్యక్తిగతంగా, రాజకీయంగా విమ ర్శల దాడిని పెంచి ఆయనకు వీచి న సానుభూతి పవనాలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈటల పేరెత్తకుండా గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీకి ఓటేద్దామా, రైతుల నడ్డివిరిచే చట్టాలు తీసుకువచ్చిన బీజేపీని గెలిపిద్దామా అంటూ బీజేపీపై రాజకీయ దాడిని ప్రారంభించడం ద్వారా పరోక్షంగా ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఈటల ప్రాభవాన్ని తగ్గించడానికి హరీశ్రావు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇతర పార్టీల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా హుజూరా బాద్ ఎన్నికను రెఫరండంగా భావిద్దామా అంటూ సవాల్ విసురుతు న్నారు. ఇప్పుడు చివరగా కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
ప్రచార పర్వంలోకి బీజేపీ అగ్ర నేతలు
ఐదు నెలలుగా అధికార పార్టీకి సవాల్ విసురుతూ ప్రజాక్షేత్రంలో నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం కొనసాగిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు అండగా నిలిచేందుకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రచారం ముగిసే వరకు వారం రోజులపాటు ఆయన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచార యాత్రలు నిర్వహించాలని నిర్ణయించు కున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఎమ్మెల్యేలు రఘునందన్రావు, రాజాసింగ్, ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు, స్టార్ క్యాంపెయినర్ బాబు మోహన్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితర పెద్దలు ఈ వారం రోజులపాటు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఈ నెల 25న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాని పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధికారికంగా మాత్రం ఇప్పటికి ప్రకటించలేదు. ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మకాం వేసి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాలు చేస్తున్నాయి. పన్నా కమిటీ లు ఓటరు జాబితాలో ఒక్కో పేజీలో ఉన్న ఓటర్ల బాధ్యతలు తీసుకొని, వారిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. వారితో ఓటే యించే బాధ్యతను కూడా ఆ కమిటీలే తీసుకున్నాయి.
కాంగ్రెస్లో జోష్ పెంచే ప్రయత్నాలు...
ఆఖరు క్షణంలో అభ్యర్థిని ప్రకటించి ఆలస్యంగా ప్రచార రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరెన్ని ప్రయ త్నాలు చేసినా అభ్యర్థిగా ఎవరిని రంగంలో దింపినా తమ ఓటు బ్యాం కు పక్కాగా ఉన్నదని భావిస్తున్నది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుం చి ఎవరు పోటీ చేసినా సుమారు 30 వేల ఓట్లు పోలవడంతో పాటు గత ఎన్నికల్లో 61 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నందున ఈ సారి కూడా హుజూరాబాద్ పోటీని ముక్కోణంగా మార్చుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సోమవారం నియోజక వర్గంలో పర్యటిం చి పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
పోలింగ్కు మరో పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉం డడంతో పది రోజులపాటు ప్రచారం ఉధృతం చేసి చివరి రెండు రోజులు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకువచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కనీసం ఐదారు రోజులు నియోజక వర్గంలో పర్యటించి ప్రచారాన్ని విస్తృతం చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ, ఎమ్మెల్యే సీతక్క, ఇతర ముఖ్య నాయకులు కూడా ప్రచారంలో పాల్గొని అభ్యర్థి బల్మూరి వెంకట్ గెలుపు కోసం కృషి చేస్తారని, హోరాహోరీగా సాగే ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ కూడా గెలుపు దారిలో ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మూడు పార్టీలు చివరి పదిరోజుల్లో తమ వ్యూహాలను అమలు చేసే విధానం, ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలపై వారి గెలుపు ఆధారపడి ఉంటుంది.