Viral Video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి శ్రీలంక కోచ్.. కెప్టెన్‌తో వాగ్వివాదం

ABN , First Publish Date - 2021-07-23T00:33:11+05:30 IST

శ్రీలంక-భారత్ మధ్య రెండో వన్డే జరుగుతున్న సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్ మికీ అర్ధర్ ఒక్కసారిగా మైదానంలోకి వచ్చి

Viral Video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి శ్రీలంక కోచ్.. కెప్టెన్‌తో వాగ్వివాదం

కొలంబో: శ్రీలంక-భారత్ మధ్య రెండో వన్డే జరుగుతున్న సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్ మికీ అర్ధర్ ఒక్కసారిగా మైదానంలోకి వచ్చి కెప్టెన్ దాసున్ షనకతో వాగ్వివాదానికి దిగడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 276 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, వరుస వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనిస్తున్న వేళ..  అనూహ్యంగా విజయం సాధించింది.


శ్రీలంక జట్టు చివర్లో చేతులు ఎత్తేసింది. మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగును దెబ్బతీసిన హసరంగకు బౌలింగు ఇవ్వకపోవడం, ఫీల్డింగ్‌లో లోపాలను డ్రెస్సింగ్ రూము నుంచి గమనించిన అర్ధర్ కోపంతో ఊగిపోయాడు. ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ చివరి ఓవర్ల సమయంలో విసురుగా మైదానంలోకి దూసుకొచ్చాడు.


కెప్టెన్ షనకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. షనక కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గట్టిగానే మాట్లాడినట్టు వీడియోను బట్టి తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ వివాదం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, మాజీ క్రికెటర్లు స్పందించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి కోచ్ రావడం ఏంటంటూ అభిమానులు మండిపడుతున్నారు. 

 

ఈ ఘటనపై మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ స్పందిస్తూ.. కెప్టెన్, కోచ్ మధ్య సంభాషణ మైదానంలో జరగాల్సింది కాదని, డ్రెస్సింగ్ రూములో అయితే బాగుంటుందని అన్నాడు. దీనికి అర్ధర్ బదులిస్తూ.. తాము గెలుపోటములను కలిసే స్వీకరిస్తామని అన్నాడు. దాసున్, తాను ఇద్దరం జట్టు ఎదుగుదల కోసమే కృషి చేస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, జట్టు ఓటమి పాలుకావడం తమను చిరాకు పరిచిందన్నాడు. తమ మధ్య అర్థవంతమైన చర్చే జరిగిందని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2021-07-23T00:33:11+05:30 IST