Covid నాలుగో వేవ్పై అప్రమత్తత అవసరం
ABN , First Publish Date - 2022-03-17T18:39:31+05:30 IST
కరోనా నియంత్రణకు జారీ చేసిన నిబంధనలను ఇటీవల కొంతకాలంగా పాటించడం లేదని ఈ పరిణామం నాల్గవ విడత కొవిడ్కు కారణం కావచ్చునని ప్రజల అప్రమత్తత
- ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ హెచ్చరిక
బెంగళూరు: కరోనా నియంత్రణకు జారీ చేసిన నిబంధనలను ఇటీవల కొంతకాలంగా పాటించడం లేదని ఈ పరిణామం నాల్గవ విడత కొవిడ్కు కారణం కావచ్చునని ప్రజల అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ సుధాకర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో 12-14 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ను బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ బయోలాజికల్ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బ్ వ్యాక్స్ను వేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షలమంది చిన్నారులకు కోర్బ్ వ్యాక్స్ టీకా ఇవ్వదలిచామన్నారు. బెంగళూరులో 6-7లక్షల మంది దాకా ఉన్నట్టు గుర్తించామన్నారు. 2008-10మధ్యన జన్మించిన చిన్నారులు వ్యాక్సిన్కు అర్హుల న్నారు. అన్ని విద్యాసంస్థలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సిన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో కరో నా నిబంధనలు ప్రజలు సక్రమంగా పాటించడం లేదని విచారం వ్యక్తం చేశారు. రెండో విడత కొవిడ్ ముగిశాక నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ప్రగతి దశలో ఉండడంతో మూడో విడత కొవిడ్ పెను ప్రభావం చూపలేదన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నాల్గవ విడతను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో చిన్నారులకు వ్యాక్సిన్ రానుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొవిడ్ అదుపులో ఉందన్నారు. బెంగళూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పదిలోపు కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్తోపాటు పలువురు పాల్గొన్నారు.