కరోనా తగ్గుముఖం.. అయినా అప్రమత్తం: మంత్రి
ABN , First Publish Date - 2022-03-20T14:02:38+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని, గత పదిరోజులుగా కరోనా బాధితులెవరూ మృతి చెందలేదని, అయినా ప్రజలు ఆ వైరస్ పట్ల అప్రమత్తంగా
చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని, గత పదిరోజులుగా కరోనా బాధితులెవరూ మృతి చెందలేదని, అయినా ప్రజలు ఆ వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, కరోనా నిరోధక నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక టి.నగర్ థామస్ రోడ్డులో ఏర్పాటైన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ శిబిరాన్ని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్తో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఈ నెల 27 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని, పొరుగు రాష్ట్రమైన కేరళలో వైరస్ వ్యాప్తి అధికమవుతున్నదని, ఈ పరిస్థితులలో ప్రజలంతా కరోనా నిరోధక నిబంధనలను తుచ తప్పక పాటించాలన్నారు. కేరళ సరిహద్దులలో ఆరోగ్య సిబ్బంది తీవ్ర నిఘా వేస్తున్నారని, ఆ రాష్ట్రం నుండి వచ్చే వాహన చోధకులకు థర్మల్ స్కాన్ పరీక్షలు కూడా చేస్తున్నారని చెప్పారు. నాలుగో విడతగా కరోనా వైరస్ వ్యాపించినా రాష్ట్రంలో బాధితులెవరూ మృతి చెందే ప్రసక్తి ఉండదని, దీనికి కారణంగా అందరూ టీకాలు వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటమేనని చెప్పారు.