భార్యతో గొడవ పడి ఇంట్లోంచి వచ్చేశాడో వ్యక్తి.. ఫ్రెండ్ కదా అని ఇంట్లోకి రానిస్తే అతడు చేసిన నీచమిది..

ABN , First Publish Date - 2021-08-05T21:16:52+05:30 IST

భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన స్నేహితుడికి అండగా నిలిచాడు..

భార్యతో గొడవ పడి ఇంట్లోంచి వచ్చేశాడో వ్యక్తి.. ఫ్రెండ్ కదా అని ఇంట్లోకి రానిస్తే అతడు చేసిన నీచమిది..

భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన స్నేహితుడికి అండగా నిలిచాడు.. తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాడు.. డబ్బులు సంపాదించుకునే మార్గం కూడా చూపెట్టాడు.. అదే అతని పాలిట శాపంగా మారింది.. చివరకు ప్రాణాలనూ హరించింది.. బెంగళూరులోని కెంపెగౌడనగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 


కెంపెగౌడనగర్‌కు చెందిన సంజు అనే వ్యక్తి తన భార్య నుంచి విడిపోయి బయటకు వచ్చేశాడు. తలదాచుకునేందుకు చోటు లేకపోవడంతో స్నేహితుడు, ఆటో డ్రైవర్ కార్తీక్‌ను ఆశ్రయించాడు. స్నేహితుడి పరిస్థితి తెలుసుకున్న కార్తీక్ అతడికి అండగా నిలిచాడు. తన ఇంటికి తీసుకెళ్లాడు. ఉదయం పూట ఆటో నడుపుకోమని సంజుకు చెప్పాడు. రాత్రిపూట కార్తీక్ ఆటో తోలేవాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కార్తీక్ భార్య రంజితతో సంజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కార్తీక్‌కు పూర్వీకుల నుంచి వచ్చిన కొంత ఆస్తి ఉందని రంజిత ద్వారా సంజుకు తెలిసింది. దీంతో కార్తీక్‌ను అడ్డు తప్పించి ఆ డబ్బుతో తామిద్దరం సంతోషంగా గడపాలని సంజు, రంజిత పథకం వేశారు. 


జూలై 29వ తేదీన కార్తీక్‌కు బాగా మద్యం పట్టించిన సంజు పెద్ద బండరాయితో అతడి తలపై మోది చంపేశాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఊరికి దూరంగా తీసుకెళ్లి పారేశాడు. తర్వాతి రోజు ఉదయం రంజిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్తీక్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. కార్తీక్ మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా అతడి కాల్ లిస్ట్, కాల్ రికార్డింగ్స్‌ను పరిశీలించారు. అలాగే సంజు, రంజిత మధ్య సంబంధం గురించి తెలుసుకుని ఇద్దరినీ విచారించగా అసలు విషయం బయటపడింది. కార్తీక్‌ను తామే చంపినట్టు ఇద్దరూ అంగీకరించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కార్తీక్ మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-08-05T21:16:52+05:30 IST