ప్రజల రాష్ట్రపతిగా గౌరవం పొందాలి

ABN , First Publish Date - 2022-07-29T05:50:50+05:30 IST

15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని దేశం జరుపుకుంటున్న వేళ...

ప్రజల రాష్ట్రపతిగా గౌరవం పొందాలి

15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని దేశం జరుపుకుంటున్న వేళ పేద కుటుంబం నుంచి వచ్చిన ఆదివాసీ మహిళకు ఆ ఉన్నత పీఠం దక్కడమన్నది ప్రజాస్వామ్యపు గొప్పదనాన్ని చాటి చెప్పింది. రాష్ట్రపతి స్థానం మన దేశపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో శక్తిమంతం కాదు. కీలక నిర్ణయాలన్నీ కేబినెట్ చేతిలోనే ఉంటాయి. అయితే ఆ పీఠం శక్తి కేంద్రం కాకపోయినా అత్యంత ప్రభావశీలం. పైగా ఆదివాసీ సంక్షేమం, షెడ్యూల్డ్ ఏరియాలో పాలన పట్ల అధ్యక్ష పీఠానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి, అక్కడి పాలనా వ్యవహారాలు ఆయా గవర్నర్ల ద్వారా తెలుసుకొని నేరుగా ఆదేశాలు జారీ చెయ్యవచ్చు. ప్రత్యేక అధికారులను నియమించవచ్చు. కమిషన్‌ని నియమించి తెలుసుకోవచ్చు. గవర్నర్లు ఆదివాసీ ప్రాంతాల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సంవత్సరమూ రాష్ట్రపతికి నివేదిస్తారు. గౌరవ రాష్ట్రపతికి ఆదివాసీ సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన ఉంది కనుక ఆయా అంశాల పట్ల శ్రద్ధ వహించగలరని ఆశ. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన అధికారిక విధుల్ని, రాజ్యాంగం అనుమతించిన మేరకు నిర్వహిస్తూనే యువతని ఉత్తేజపరచడానికి చొరవ తీసుకున్నారు. ఆ రకమైన చొరవ గౌరవ రాష్ట్రపతి గైకొనాలి. ఆమె పట్ల భారతీయ సమాజం, ప్రత్యేకించి అణగారిన వర్గాలు పెట్టుకున్న ఆశల్ని గుర్తించి, ప్రజల రాష్ట్రపతిగా గౌరవం పొందాలి. 

డా. డి.వి.జి. శంకరరావు

Updated Date - 2022-07-29T05:50:50+05:30 IST