దేశం ఆర్థికంగా ముందుకు సాగాలని ప్రార్థించా
ABN , First Publish Date - 2021-10-28T06:42:21+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించాలని, భారత దేశం ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు.
మిజోరాం గవర్నర్ హరిబాబు
తిరుమల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించాలని, భారత దేశం ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన హరిబాబు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపానికి చేరుకున్న హరిబాబును వేదపండితులు ఆశీర్వదించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్ బుక్ను అందజేశారు. దర్శనం తర్వాత కంభంపాటి హరిబాబు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ మిజోరాం గవర్నర్గా నియమితులైన తర్వాత మొదటిసారిగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా తిరుమలకు రాలేకపోయానని తెలిపారు.