పెళ్లి చేయడం లేదని తండ్రిని.. బాబాయ్ని చంపేశాడు!
ABN , First Publish Date - 2022-08-13T07:08:42+05:30 IST
30ఏళ్లు వచ్చినా.. తనకు ఇంకా పెళ్లి చేయడం లేదన్న కక్షతో సొంత కొడుకే.. తండ్రితో పాటు అడ్డొచ్చిన బాబాయిని కూడా పారతో చితకబాది దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలో కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళితే.. మోపాల్ గ్రామానికి చెందిన అబ్బయ్య (62) వ్యవసాయం
ఇనుప పారతో తలపై బాది.. దారుణంగా హత్య
మోపాల్లో పండుగ పూట విషాదం
మోపాల్, ఆగస్టు 12: 30ఏళ్లు వచ్చినా.. తనకు ఇంకా పెళ్లి చేయడం లేదన్న కక్షతో సొంత కొడుకే.. తండ్రితో పాటు అడ్డొచ్చిన బాబాయిని కూడా పారతో చితకబాది దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలో కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళితే.. మోపాల్ గ్రామానికి చెందిన అబ్బయ్య (62) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. రెండో కుమారుడైన సతీష్ రెండేళ్ల క్రితమే దుబాయి నుంచి మోపాల్కు తిరిగొచ్చాడు. ఇక అప్పటి నుంచి ఏ పనీ లేక గ్రామంలో జులాయిగా తిరుతున్నాడు. అయితే పెద్ద కుమారుడు మోహన్కు దుబాయిలో మంచి వేతనం ఉండడంతో ఐదేళ్ల క్రితం పెళ్లి చేశాడు. అప్పటినుంచి తనకు కూడా పెళ్లి చేయాలని సతీష్ నిత్యం తండ్రి అబ్బయ్యను వేధించసాగాడు. దుబాయి నుంచి తిరిగొచ్చాక ఇది మరింత ఎక్కువైంది. కానీ సతీష్ ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దే ఖాళీగా ఉంటుండడంతో.. ఎవరూ పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తనకు ఎందుకు పెళ్లి చేయడం లేదని, పెళ్లి సంబంధాలు ఎందుకు చూడడం లేదంటూ ప్రతీరోజు తల్లిదండ్రులు లక్ష్మీ, అబ్బయ్యతో సతీష్ గొడవ పడుతుండేవాడు. ఈ విషయంలో శుక్రవారం తెల్లవారుజామున కూడా తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేయాలని, లేకుంటే అంతు చూస్తానని తండ్రి అబ్బయ్యను కొడుకు సతీష్ బెదిరించాడు. దీంతో పని చేసుకుంటేనే ఎవరైనా పిల్లను ఇస్తారని, లేదంటే ఎవరిస్తారని తండ్రి ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సతీష్ పక్కనే ఉన్న పారతో తండ్రి అబ్బయ్యపై ఒక్కసారిగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బాబాయి నడ్పి సాయిలు(58) అడ్డు రాగా.. సతీష్ అతనిపై కూడా పారతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. తలపై గట్టిగా కొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరగగానే సతీష్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న అబ్బయ్య భార్య లక్ష్మీ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. నిజామాబాద్ ఏసీపీ వేంకటేశ్వర్, నార్త్ సీఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. శుక్రవారం సాయంత్రం వేళ నిందితుడు సతీష్ను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది.