కెనడాలో ఎంపీ కార్యాలయం ముందు భారతీయుల నిరసన!

ABN , First Publish Date - 2021-02-27T02:33:55+05:30 IST

కెనడా ఎంపీ కార్యాలయం ముందు కెనడాలోని భారతీయులు నిరసనకు దిగారు. రైతులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదారిపట్టాయని ఈ సందర్భంగా వారు ఆరోపిం

కెనడాలో ఎంపీ కార్యాలయం ముందు భారతీయుల నిరసన!

ఒట్టావా: కెనడా ఎంపీ కార్యాలయం ముందు కెనడాలోని భారతీయులు నిరసనకు దిగారు. రైతులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదారిపట్టాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు కొద్ది నెలలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొందరు నిరసనకారులు ఎర్రకోటపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో కెనడాలోని భారతీయులు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తూ తిరంగ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఖలీస్థానీల నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్టు కెనడాలోని కొందరు భారతీయులు ప్రకటించారు. అంతేకాకుండా అలయన్స్ ఆఫ్ ఇండో-కెనడియన్స్ (ఎన్ఏఐసీ) కెనడా మంత్రికి లేఖ రాసి.. కెనడియన్ హిందువులు, మోడరేట్ సిక్కులకు భద్రత కల్పించాలని లేఖలో కోరింది.



ఈ నేపథ్యంలోనే కెనడాలోని కొందరు భారతీయులు కెనడా ఎంపీ జగ్మీత్ సింగ్ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఖలీస్థానీలకు వ్యతిరేకంగా.. కెనడా జాతీయ జెండాను చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘రైతులకు మేము వ్యతిరేకం కాదు. కానీ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలు పక్కదారి పట్టాయి. ఖలీస్థానీ ఉద్యమంగా మార్పు చెందింది’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచన తరుణంలో తమకు బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సమయంలో నాయకులు ఎటువంటి వివక్ష చూపకుండా తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ బెదిరింపుల విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. కెనడాలోని భారతీయులకు రక్షణ కల్పించాలని అక్కడి అధికారులను కోరిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-02-27T02:33:55+05:30 IST