రూ.కోటి హవాలా డబ్బు స్వాధీనం
ABN , First Publish Date - 2020-11-30T06:43:59+05:30 IST
ఏ విధమైన లెక్కలు లేవు.. ఏకంగా కోటి రూపాయలు.. రెండు బ్యాగ్ల్లో సర్దేసి, బస్సులోకి ఎక్కిస్తుండగా, పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
ఇద్దరి అరెస్టు
విజయవాడ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఏ విధమైన లెక్కలు లేవు.. ఏకంగా కోటి రూపాయలు.. రెండు బ్యాగ్ల్లో సర్దేసి, బస్సులోకి ఎక్కిస్తుండగా, పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన ఇంద్రసింగ్, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉదయ్కుమార్ సెల్ఫోన్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉదయ్కుమార్ గుంతకల్లు నుంచి విజయవాడ వచ్చాడు. ఇంద్రసింగ్తో కలిసి కోటి రూపాయలు రెండు బ్యాగ్ల్లో సర్దుకుని, పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు చేరుకుని, గుంతకల్లు బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉండగా, టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ వర్మ బృందం దాడిచేసి పట్టుకుంది. ఇంద్రసింగ్ను, ఉదయ్కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన మరో వ్యక్తి గుంతకల్లులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు వ్యాపారంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు తేలింది. ఎలాంటి లెక్కాపత్రాలు లేకుండా రహస్యంగా తరలించడానికి ఇదే కారణమని గుర్తించారు. నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.