వరంగల్‌లో మద్యం మత్తులో ఒకరి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-04-16T05:44:30+05:30 IST

వరంగల్‌లో మద్యం మత్తులో ఒకరి దారుణ హత్య

వరంగల్‌లో మద్యం మత్తులో ఒకరి దారుణ హత్య
సంఘటన స్థలంలో చందు మృతదేహం

హన్మకొండ టౌన్‌, ఏప్రిల్‌ 15: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన సమీప బంధువునే దారుణంగా హత్య చేశాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కేయూ పోలీ్‌సస్టేషన్‌ పరిధి చింతగట్టు గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండల కేంద్రంలో నివాసముండే సమీప బంధువులు మోతె చందు(26), అయిలుమల్లు.. వీరిద్దరు సీజనల్‌ వ్యాపారం చేస్తుంటారు. చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

కాగా, గురువారం మధ్యాహ్నం చింతగట్టు సమీపంలో మద్యం తాగేందుకు చందు, అయిలుమల్లు వెళ్లారు. మద్యం మత్తులో ఇద్దరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో అయిలుమల్లు మద్యం సీసా పగలగొట్టి చందు గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై చందు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చందును హత్య చేసిన అయిలుమల్లు పోలీసులు వచ్చే వరకు సంఘటన స్థలంలోనే ఉన్నాడు. స్థానికుల సమాచారంతో కేయూ సీఐ జానార్దన్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లి అయిలుమల్లును అదుపులోకి తీసుకున్నారు. చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలిసింది. అయితే గురువారం ఓ యువతి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-04-16T05:44:30+05:30 IST