హత్రాస్ ఘటన.. దర్యాప్తు, సీఎం హామీపై బాధితురాలి తండ్రి సంతృప్తి

ABN , First Publish Date - 2020-10-01T22:43:01+05:30 IST

కడచూపునకు కూడా నోచుకోకుండా తమ కుమార్తెను పోలీసులు దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన హత్రాస్ బాధిత యువతి కుటుంబ

హత్రాస్ ఘటన.. దర్యాప్తు, సీఎం హామీపై బాధితురాలి తండ్రి సంతృప్తి

లక్నో: కడచూపునకు కూడా నోచుకోకుండా తమ కుమార్తెను పోలీసులు దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన హత్రాస్ బాధిత యువతి కుటుంబ సభ్యులు నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హామీపై సంతృప్తి వ్యక్తం చేశారు.


బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి ధర్నాలకు గానీ, ఆందోళనకు కానీ దిగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హత్రాస్ బాధిత కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు రెడీ అయిన సమయంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


హత్రాస్ అత్యాచారం, బాధిత యువతి మృతదేహానికి ఆగమేఘాల మీద అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్రంగా మండిపడిన ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. సీఎంతో మాట్లాడానని, తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. యోగి హామీతో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు.


తమ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన యోగి గొప్ప సీఎం అని కొనియాడారు. ఈ కష్టసమయంలో తమకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు, హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారి కాన్వాయ్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 


Updated Date - 2020-10-01T22:43:01+05:30 IST