Haryana: ట్రక్కు ఎక్కించి డీఎస్‌పీని హతమార్చిన మైనింగ్ మాఫియా

ABN , First Publish Date - 2022-07-19T22:37:08+05:30 IST

హర్యానాలోని పచగావ్‌ పర్వత ప్రాంతంలో మంగళవారంనాడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు..

Haryana: ట్రక్కు ఎక్కించి డీఎస్‌పీని హతమార్చిన మైనింగ్ మాఫియా

చండీగఢ్: హర్యానాలోని పచగావ్‌ పర్వత ప్రాంతంలో మంగళవారంనాడు దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌‌(surendra singh Bishnoi)పై మైనింగ్ మాఫియా దాడి చేసింది. ఆయనపై ట్రక్కు ఎక్కించి హతమార్చింది. ఈ ఘటనలో బిష్ణోయ్ అక్కడికకక్కడే మృతిచెందారు.


పచగావ్ సమీపంలో అక్రమ మైనింగ్ చురుకుగా సాగుతున్న సమాచారం అందడంతో తౌరు డీఎస్‌పీ బిష్ణోయ్ అక్కడకు చేరుకున్నాడు. రాయి తీసుకుని వెళ్తున్న ట్రక్కును ఆపమని డీఎస్‌పీ ఆదేశించారు. ట్రక్కు డ్రైవర్ వేగాన్ని తగ్గించడానికి బదులు మరింత వేగంగా ఆయన మీద నుంచి పోనిచ్చాడు. బిష్ణోయ్ ఈ ఏడాది రిటైర్ కావాల్సి ఉంది.


ఈ ఘటనపై సౌత్ రేంజ్ ఐజీపీ రవి కిరణ్ మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ సమాచారం అందగానే బిష్ణోయ్ ఆకస్మికంగా తనిఖీకి వచ్చారని, తగిన బందోబస్తు లేకుండా వెళ్లకూడదని, అయితే అందుకు ఆయనకు సమయం లేకపోయి ఉండవచ్చని అన్నారు.ట్రక్కు డ్రైవర్ ఆయనపైకి దూసుకు వెళ్లాడని, ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదని చెప్పారు. నిందితుడు పరారు కావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విధి నిర్వహణలో ఉండగా బిష్ణోయ్ ప్రాణాలు కోల్పోవడంపై హర్యానా పోలీసులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపారు.


సీఎం సంతాపం.. కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా..

డీఎస్‌పీ హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్‌పీ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, అమరవీరునిగా గుర్తిస్తామని చెప్పారు.

Updated Date - 2022-07-19T22:37:08+05:30 IST