రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రమంత్రి హర్షవర్థన్ సమావేశం

ABN , First Publish Date - 2020-04-10T19:29:07+05:30 IST

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఇవాళ...

రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రమంత్రి హర్షవర్థన్ సమావేశం

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. నిర్మల్ భవన్ నుంచి జరిగిన ఈ సమావేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగుల చికిత్స కోసం చేసిన ఏర్పాట్లను అడిగితెలుసుకోడంతో పాటు... వైరస్ మరింత వ్యాప్తి చెందితే ఎదుర్కునేందుకు సన్నద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు.


 కాగా కొవిడ్-19పై నిన్న జరిగిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్సులో హర్షవర్థన్ పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కునేందుకు భారత్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు ఆయన ఈ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని విధాలుగా సిద్ధపడడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో సంప్రదింపులు జరుపుతున్నట్టు హర్షవర్థన్ తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇవాళ 6,412కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-04-10T19:29:07+05:30 IST