సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

ABN , First Publish Date - 2022-07-04T05:02:57+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మనందరం రుణపడి ఉంటామని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మూడు జిల్లాల్లో బీటీ రోడ్ల మరమ్మతుకు రూ. 401 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆదివారం ఆయన మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌ అధికారులు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రూ. 401 కోట్లతో రోడ్ల పునరుద్ధరణ

1,494 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు

నెలాఖరులోగా టెండర్లు, వర్షాలు తగ్గగానే పనులు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

పంచాయతీరాజ్‌ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష


సిద్దిపేట టౌన్‌, జూలై 3: ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మనందరం రుణపడి ఉంటామని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మూడు జిల్లాల్లో బీటీ రోడ్ల మరమ్మతుకు రూ. 401 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆదివారం ఆయన మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌ అధికారులు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్ల పునరుద్ధరణ, కొనసాగుతున్న పనులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మన ఊరు-మన బడి, హెల్త్‌సబ్‌సెంటర్లు, ఉపాధిహామీ, గ్రామీణ సడక్‌ యోజన తదితర పనుల పురోగతిపై నియోజక వర్గాలవారీగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ ద్వారా రూ. 321 కోట్లు, పంచాయతీరాజ్‌ ఎంఆర్‌ఆర్‌ ద్వారా రూ. 80 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 13 నియోజకవర్గాల్లో పంచాయితీరాజ్‌ పరిధిలోని 454 పనుల ద్వారా 1,494 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. ఎస్‌డీఎఫ్‌ రోడ్ల మరమ్మతు పనులను నియోజకవర్గాలవారీగా, ప్యాకేజీవారీగా అప్పగించాలని నిర్ణయించారు. నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి, వర్షాలు తగ్గగానే మరమ్మతు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


గతంలో ఎన్నడూ లేనంత భారీగా నిధులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోడ్ల పునరుద్దరణకు గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో నిధులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, అందుకే ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరుకావడం సాధ్యమైందన్నారు. నిధులను సద్వినియోగం చేసుకొని పనులు నాణ్యంగా జరిగేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఇప్పటికే పూర్తైన ఇళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మన ఊరు-మన బడి పనులు వెంటనే పూర్తిచేయాలని పేర్కొన్నారు. చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాకలో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ల పనులను పూర్తి చేయాల సంబంధిత అధికారుకు తెలిపారు. రోడ్ల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకు ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు. సమీక్షలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మేల్యేలు సతీష్‌కుమార్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, మార్కెట్‌ చైర్మన్‌ శివకుమార్‌, దేవేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జోగారెడ్డి, ఈఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు.


వైద్యారోగ్య శాఖ పరిధిలోని పనులపై ఆరా

మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో వైద్యారోగ్య శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీఎ్‌స ఎంఎ్‌సఐడీసీ తదితర అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, గడువులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, హెల్త్‌ సబ్‌సెంటర్ల నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-04T05:02:57+05:30 IST