ఆ పని చేసే వారిపై జరిమానా విధించాలి: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-05-28T22:49:29+05:30 IST

అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఆ పని చేసే వారిపై జరిమానా విధించాలి: హరీశ్‌రావు

సిద్ధిపేట: అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని   రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి హరీశ్  మీడియాతో మాట్లాడుతూ.. నిధులు ఖర్చు చేయడం కంటే.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. పట్టణంలో త్వరగా మిగిలిన యూజీడీ కనెక్షన్లు పూర్తి చేయాలని చెప్పారు.మున్సిపాలిటీ పన్ను వసూళ్లు చేసి, తాడిపత్రి మున్సిపాలిటీ తరహాలో మిగులు బడ్జెట్ ఉండేలా సద్వినియోగం చేసుకోవాలన్నారు.సిద్ధిపేట పట్టణ తాగునీటి కోసం ప్రతినెలా 80 లక్షలు కరెంటు బిల్లు చెల్లించాలన్నారు.రోజుకూ పట్టణంలో పన్నెండున్నర టన్నులు రావాల్సిన చోట కేవలం 7 టన్నుల పొడిచెత్త వస్తున్న దృష్ట్యా.. డీఆర్సీసీలోనే పొడి చెత్త సెగ్రిగేషన్ జరగాలని సూచించారు. బుస్సాపూర్ డంపింగ్ యార్డుకు కేవలం తడిచెత్త మాత్రమే పోయేలా చూడాలన్నారు.బ్లాక్ స్పాట్లలో చెత్త వేసిన వారిపై తప్పనిసరిగా జరిమానా విధించాలని హెచ్చరించారు.పట్టణంలో 127 బ్లాక్ స్పాట్లు ఉంటే., ప్రస్తుతం 88 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, అన్నీచోట్ల సీసీ కెమెరాలు బిగించి పోలీసు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. 

Updated Date - 2022-05-28T22:49:29+05:30 IST