బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ
ABN , First Publish Date - 2022-05-16T08:45:40+05:30 IST
తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన అమిత్ షా కాదని.. అబద్ధాల బాద్షా అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
ఇది గుజరాత్ కాదు.. పోరాటల తెలంగాణ గడ్డ: హరీశ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన అమిత్ షా కాదని.. అబద్ధాల బాద్షా అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. అమిత్షా మాటలు విన్న తర్వాత ఆయనకు అల్జీమర్ వ్యాధి ఉందేమోనన్న సందేహం వస్తోందన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. తుక్కుగూడ సభలో ప్రజా స్పందన లేదని, అమిత్షా స్ర్కిప్టు రైటర్ సరిగా లేరని, అమిత్షా.. అంటే అమిత్లో మిత్ (మిత్ అంటే మాయ) మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
ఇది గుజరాత్ కాదని, పోరాటాల తెలంగాణ గడ్డ అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో టీఆర్ఎస్ అనుకూలంగా ఓటేసినట్లు చెప్పారు. ఈ విషయంలో సంజయ్, కిషన్రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు రూ.2 కూడా ఇవ్వకుండా రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చినట్లు అమిత్షా చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతోందని, అయినా అమిత్ షా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ మంత్రులకు లేదని ఆయన అన్నారు.
తెలంగాణ గాంధీ కేసీఆర్: ఎర్రబెల్లి
ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అని, కేసీఆర్ కుటుంబం పదవుల కోసం కాకుండా తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులిస్తోందంటూ బీజేపీ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు.
కేసీఆర్ అంటే బీజేపీకి భయం: జగదీశ్ రెడ్డి
బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో చీకట్లు అలుముకున్నాయని, తెలంగాణలోనూ విద్యుత్ కష్టాలు వచ్చేలా బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్పై అమిత్షా విషం చిమ్మడం తప్ప అసలు విషయం ఏమీలేదని, ఆయనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.
దోచుకుంటున్న బీజేపీ: తలసాని, ప్రశాంత్
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ అదానీ, అంబానీలతో కలిసి బీజేపీ దేశాన్ని దోచుకుంటోందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఆ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు. కేసీఆర్ దేశంలో ప్రత్యామ్నాయ అజెండా తెరపైకి తెస్తారనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణపై దండయాత్రకు దిగాయని విప్ బాల్కసుమన్ అన్నారు.