అభివృద్ధికి పట్టం కట్టండి
ABN , First Publish Date - 2021-10-28T09:08:06+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలిస్తే ..
రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
కేంద్ర మంత్రులు ఏం చేశారో చెప్పాలి: హరీశ్
బీసీలను ఎదగనివ్వని ఈటల: శ్రీనివా్సగౌడ్
హుజూరాబాద్/జమ్మికుంట రూరల్/అక్టోబరు 27: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తామో చెప్పాం.. కానీ బీజేపీ మాత్రం ఒక్క ముక్క చెప్పలేదన్నారు. ఓటుకు 20 వేల రూపాయలు ఇస్తున్నారని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ వారు డబ్బులు, మద్యం, మాంసాన్ని నమ్ముకున్నారని, తాము కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు నమ్ముకున్నామన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో, హుజూరాబాద్ విలేకరులతో ఆయన మాట్లాడారు. తాము ఏడేళ్లు ఏం చేశాం, మేనిఫెస్టోను ఎలా అమలు చేశాం...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లలో ఏం చేసింది.. మేనిఫెస్టో ఎలా అమలు చేశారో అనే విషయంపై చర్చకు రమ్మన్నామని, ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. విషయం లేకనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర మంత్రులు తెలంగాణను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి, బండి సంజయ్కు లేదన్నారుఈ నెల 30 తర్వాత వంటగ్యాస్ ధరను మరో 200 రూపాయలు కేంద్రం పెంచడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనబోదని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఊరురా వడ్లు కొనుగోలు చేయడానికి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని బీసీ నాయకులను ఎదగనివ్వని వ్యక్తి ఈటల అని మంత్రి శ్రీనివా్సగౌడ్ అన్నారు.