‘మనవాళ్లే’ వేధిస్తున్నారు సార్..!
ABN , First Publish Date - 2021-10-26T08:29:50+05:30 IST
‘‘మన పార్టీ నేతలే.. మా స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు
స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను
లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ సిబ్బంది
లబోదిబోమన్న వైసీపీ గుడివాడ కార్యకర్త
సీఎంవోలో ఫిర్యాదు చేసేందుకు పాదయాత్ర
గుడివాడ, అక్టోబరు 25: ‘‘మన పార్టీ నేతలే.. మా స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తే మన ప్రభుత్వ సిబ్బందే లంచం డిమాండ్ చేస్తున్నారు’’ అని అధికార పార్టీకి చెందిన గుడివాడ కార్యకర్త లబోదిబోమన్నారు. ఈ క్రమంలో తన గోడును నేరుగా ముఖ్యమంత్రికే చెప్పుకొనేందుకు ఆయన గుడివాడ నుంచి పాదయాత్రగా తాడేపల్లిలోని సీఎంవోకు బయల్దేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పసమర్రులో గుడివాడ వాసి, వైసీపీ కార్యకర్త పల్లపు శ్రీనివాసరావు తల్లికి 3 సెంట్ల స్థలం ఉంది. అయితే.. ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వైసీపీ నేతలే ప్రయత్నిస్తుండడంతో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించినట్టు శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం చిలకలూరిపేట ఎమ్మా ర్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారని వాపోయారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తనే లంచం డిమాండ్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి తనను ఆవేదనకు గురిచేశాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీంతో అధికారుల వేధింపులు, అవినీతిని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడానికి నిర్ణయించుకుని, గుడివాడ నుంచి పాదయాత్ర చేపట్టినట్టు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఉదయం గుడివాడ నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని గుడివాడ నుంచి తిరుపతికి పాదయాత్ర చేశానని, వైసీపీ కార్యకర్తగా పనిచేసిన తనకే ఇలాంటి వేధింపులు ఎదురవుతుంటే సామాన్యుల గతేంటని శ్రీనివాసరావు ప్రశ్నించారు.