Harassed by father: జైలు నుంచి బయటకొచ్చిన తండ్రి.. కుమార్తె ఆత్మహత్య!
ABN , First Publish Date - 2022-09-20T23:45:47+05:30 IST
జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న తండ్రి పెరోల్పై బయటకు వచ్చి చిత్రహింసలకు గురిచేస్తుండడంతో
బండా: జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న తండ్రి పెరోల్పై బయటకు వచ్చి చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ఆయన ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో అక్క మృతి చెందగా, చెల్లెలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని బాండా (Banda) జిల్లా బబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్హిరీ గ్రామంలో జరిగిందీ ఘటన. అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీనివాస్ మిశ్రా కథనం ప్రకారం.. రేఖాదేవి-మల్ఖాన్ సింగ్ దంపతులకు ప్రియాంక (21), స్వప్న (19) సంతానం.
16 ఏళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో మల్ఖాన్ సింగ్కు జీవిత ఖైదు పడింది. ఆరు నెలల క్రితం పెరోల్పై బయటకు వచ్చిన మల్ఖాన్ సింగ్, సోదరులు సురేష్, రాజేష్లతో కలిసి భార్యా పిల్లలను చితకబాదేవాడు. వారు ఇంట్లో వంట చేయకుండా నాటుతుపాకితో బెదిరించేవారు. తండ్రి పెడుతున్న చిత్రహింసలను భరించలేని కుమార్తెలు ప్రియాంక, స్వప్న విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే వారిని బాండా మెడికల్ కాలేజీ (Banda Medical College)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా, స్వప్న చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధిత యువతుల తల్లి రేఖాదేవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్ఖాన్ సింగ్ను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు.