హనుమాన్ నాణేల అమ్మకందారు మోసం... ముగ్గురు కిడ్నాపర్ల అరెస్టు...

ABN , First Publish Date - 2022-03-11T17:34:01+05:30 IST

పురాతన హనుమాన్ నాణేలను అమ్ముతానని చెప్పి,

హనుమాన్ నాణేల అమ్మకందారు మోసం... ముగ్గురు కిడ్నాపర్ల అరెస్టు...

భువనేశ్వర్ : పురాతన హనుమాన్ నాణేలను అమ్ముతానని చెప్పి, మోసగించిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన ముగ్గుర్ని ఒడిశా కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.  కేంద్రపదకు చెందిన బిబేకానంద మహలి ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3,50,000 వసూలు చేశారు. వారికి హనుమాన్ నాణేన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన మోసం చేసినట్లు తెలుసుకున్న ఆ ముగ్గురూ ఆయనను కిడ్నాప్ చేసి, కొట్టారు. ఆయనను చావగొడుతున్నట్లు వీడియో తీసి, ఆయన కుటుంబానికి పంపించారు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


మహలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి, భరత్‌పూర్‌లోని ఓ లాడ్జిలో వారు ఉన్నట్లు గుర్తించి, దాడి చేశారు. మహలిని కిడ్నాప్ చేసినందుకు భక్త హరి మహాపాత్ర, తోషిబా నంద గచ్చయాత్, ప్రదీప్ కుమార్ బెహరాలను అరెస్టు చేశారు. 


జోన్ 3 ఏసీపీ రజత్ రే మాట్లాడుతూ, మహలి కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు తాము మహలిని కిడ్నాప్ చేసిన బృందం ఉన్న చోటును గుర్తించామన్నారు. మహలి  హనుమాన్ నాణేన్ని ఇస్తానని చెప్పి, ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3,50,000 తీసుకున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. హనుమాన్ నాణేన్ని ఇవ్వకుండా, తప్పించుకు తిరుగుతున్న మహలిని ముగ్గురూ కలిసి కిడ్నాప్ చేశారన్నారు.  కిడ్నాప్ చేసిన ముగ్గుర్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచినట్లు చెప్పారు. 


Updated Date - 2022-03-11T17:34:01+05:30 IST