హనుమాన్ చాలీసా వివాదం : ఆసుపత్రిలో చేరిన నవనీత్ రాణా

ABN , First Publish Date - 2022-05-06T00:28:05+05:30 IST

అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, బద్నేరా ఎమ్మెల్యే రవి రాణా

హనుమాన్ చాలీసా వివాదం : ఆసుపత్రిలో చేరిన నవనీత్ రాణా

ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, బద్నేరా ఎమ్మెల్యే రవి రాణా గురువారం బెయిలుపై విడుదలయ్యారు. ఆమె వైద్య పరీక్షల కోసం లీలావతి ఆసుపత్రికి వెళ్ళారు, అనంతరం ఆమె ఆ ఆసుపత్రిలో చేరారు. ఆమెను రవి రాణా, బీజేపీ నేత కిరీట్ సోమయ్య పరామర్శించారు. ముంబైలోని బొరివలిలో ఉన్న కోర్టు రాణా దంపతుల విడుదలకు ఆదేశాలను జారీ చేసింది. 


రాణా దంపతులు రూ.50,000 చొప్పున పూచీకత్తులు సమర్పించారు. అనంతరం తలోజా జైలు నుంచి రవి రాణా, బైకులా జైలు నుంచి  నవనీత్ రాణా విడుదలయ్యారు. వీరిద్దరికీ బుధవారం బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. స్పాండిలోసిస్ చికిత్స కోసం నవనీత్‌ను బుధవారం బైకులా జైలు నుంచి జేజే ఆసుపత్రికి తీసుకెళ్లి, తిరిగి బుధవారం సాయంత్రం ఆమెను జైలుకు తరలించారు.


రాణా దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ‘మాతోశ్రీ’ ఎదుట ఏప్రిల్ 23న హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు. దీంతో వీరిద్దరూ ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని, దేశద్రోహానికి పాల్పడుతున్నారని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై దాడి చేశారని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. 


Read more