అడవిలో చెట్లకు వేలాడుతూ... స్నేహితుల మృతి
ABN , First Publish Date - 2021-01-13T06:56:04+05:30 IST
అదృశ్యమైన ఇద్దరు స్నేహితులు
హత్య...? ఆత్మహత్య..?
జీడిమెట్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : అదృశ్యమైన ఇద్దరు స్నేహితులు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల సీఐ బాలరాజు కథనం ప్రకారం.. గాజులరామారం గ్రామానికి చెందిన బండోజి సత్యనారాయణ కుమారుడు సాయికుమార్ (22) ఎలక్ట్రీషియన్. ఈ నెల 10 సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చిన సాయికుమార్ కొంచెం సేపటి తర్వాత బయటకు వెళ్లాడు. కొడుకు ఎంతరికీ తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ అందరినీ విచారిస్తున్నాడు. ఇంతలో సంజయ్గాంధీనగర్కు చెందిన నరేష్ (22) ఫోన్ చేసి ‘మీ కొడుకు సాయికుమార్ నా తోనే ఉన్నాడు’ అని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. అదే రోజు రాత్రి నరేష్ తన తల్లికి ఫోన్చేసి అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్సాబ్గూడ ఫారెస్ట్లో ఇద్దరు యువకులు చెట్టుకు ఉరేసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు వారు సాయికుమార్, నరేష్గా గుర్తించారు. వారిద్దరు చీరలతో ఉరేసుకుని వేర్వేరు చెట్లకు వేలాడుతూ కనిపించారు. వీరి మృతికి గల కారణాలు తెలియ లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చీరలు ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.