చేతికందని ‘కౌలు’ పంట

ABN , First Publish Date - 2022-05-20T06:31:01+05:30 IST

రాత్రిబంవళ్లు కష్టపడి కాపాడుకున్న మొక్క జొన్న పంట పండినా.... చివరికి వర్షానికి తడిసి బూజుపట్టి ఆదాయం చేతికంద కుండా పోయిందని మండలరైతులు వాపోతున్నారు.

చేతికందని ‘కౌలు’ పంట
బూజుపట్టిన మొక్కజొన్న కంకులు

నంబులపూలకుంట, మే 19: రాత్రిబంవళ్లు కష్టపడి కాపాడుకున్న మొక్క జొన్న పంట పండినా.... చివరికి వర్షానికి తడిసి బూజుపట్టి ఆదాయం చేతికంద కుండా పోయిందని మండలరైతులు వాపోతున్నారు. మండలకేంద్రం సమీపంలో కౌలు రైతు ఉత్తన్న నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాడు.  తనకు భూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. నాలుగు ఎకరాల్లో సాగుకు రూ. రెండున్నర లక్ష పెట్టుబడి అయిందన్నాడు. ఇటీవల పంట కోసి కుప్పగా వేశాడు. అయితే ఐదురోజుల నుంచి వర్షం పడుతుండడంతో కంకులపై కప్పిన టార్బాల్‌ తీయలేకపోయాడు. దీంతో కంకులు పూర్తిగా బూజుపట్టి, పనికిరా కుండా పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ పొలంలోనే కంకులు కుప్ప వేయడంతో అక్కడికి యంత్రాలు పోతే దిగుబడతాయని తెలిపాడు. దాని వలన గురువారం కూలీలను ఎక్కువమందిని పెట్టి మరో ప్రాంతంలోకి కంకులను తరలించి, ఫ్యాన్ల కింద ఆరబెట్టానన్నాడు. ఈ కంకులు తరలించడానికి రూ.50వేల దాకా ఖర్చు వచ్చిందన్నారు. ప్రస్తుతం కనీసం పెట్టుబడికూడా వచ్చే పరిస్థితి లేదన్నాడు. మొక్కజొన్న కంకులు కోసిన రోజుల్లో క్వింటా రూ.2,500 ధర ఉండేదని, ప్రస్తుతం కంకులు బూజు పట్టడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి  ముందుకు రావడంలేదని కంటతడిపెట్టాడు. తనను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. 

Updated Date - 2022-05-20T06:31:01+05:30 IST