జిల్లాకో హ్యాండ్బాల్ అకాడమీ: హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు
ABN , First Publish Date - 2021-06-24T02:49:22+05:30 IST
కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖలు, భారత ఒలింపిక్ సంఘం సహకారంతో దేశంలో హ్యాండ్బాల్కు మునుపెన్నడు లేనంత క్రేజ్ తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్రావు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖలు, భారత ఒలింపిక్ సంఘం సహకారంతో దేశంలో హ్యాండ్బాల్కు మునుపెన్నడు లేనంత క్రేజ్ తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్రావు చెప్పారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ హ్యాండ్బాల్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రతీ జిల్లాలో ఒక హ్యాండ్బాల్ అకాడమీని పెట్టేందుకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 1970వ దశకంలో హ్యాండ్బాల్కు హైదరాబాద్ హబ్గా ఉండేదని.. తిరిగి ఆ వైభవాన్ని సాధించేందుకు కోచ్లు, సీనియర్ క్రీడాకారులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. అధునాతన సదుపాయాలతో నగరంలో ఒక ఇండోర్ హ్యాండ్బాల్ స్టేడియంతో పాటు దానికి అనుబంధంగా అకాడమీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 2024 ఒలింపిక్స్ కు భారత జట్టు అర్హత సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని.. దీనికి తగ్గట్టు క్రీడాకారులు కష్టపడి రాణించి దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జగన్ మోహన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ కోచ్లు నంద గోకుల్, రవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.