కరోనాకు గురైన హల్వా దుకాణం యజమాని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-26T19:51:12+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరునల్వేలి ‘ఇరుట్టుకడై హల్వా’ దుకాణం యజమాని హరిసింగ్‌ (75) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరోనాకు గురైన హల్వా దుకాణం యజమాని ఆత్మహత్య

చెన్నై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరునల్వేలి ‘ఇరుట్టుకడై హల్వా’ దుకాణం యజమాని హరిసింగ్‌ (75) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరునల్వేలి నగరం నడిబొడ్డున నెల్లయప్పర్‌ ఆలయం సమీపంలో వున్న ఈ హల్వా దుకాణాన్ని 1940లో రాజస్థాన్‌కు చెందిన బిజిలీసింగ్‌ అనే వ్యక్తి  ప్రారంభించాడు. చిన్న బడ్డీకొట్టులా ఉండే ఆ దుకాణంలో వేడివేడిగా రోజు తయారయ్యే హల్వా కోసం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జనం పోటెత్తేవారు. ప్రస్తుతం ఆ దుకాణాన్ని బిజిలీ సింగ్‌ మూడో తరానికి చెందిన హరిసింగ్‌ నడుపుతున్నాడు. గత పదేళ్లుగా హరిసింగ్‌ నేతృత్వంలో ఆ దుకాణంలో తయారయ్యే హల్వా దేశవిదేశాలకు కూడా ఎగుమవుతోంది.  ఈ నేపథ్యంలో ఇటీవల హరిసింగ్‌ అల్లుడు గోపాల్‌ సింగ్‌కు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే అతడు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో భయాందోళనలకు లోనైన హరిసింగ్‌ అస్వస్థతకు గురై పాళయంకోటలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులకు ముందు హరిసింగ్‌కు కూడా ఆరోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం ఉదయం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన హరిసింగ్‌ తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరిసింగ్‌ మృతితో ఇరుట్టుకడై హల్వా దుకాణాన్ని మూసివేశారు.  కాగా కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు ఇరుట్టుకడై హల్వా దుకాణం ఉన్న ప్రాంతమంతటా క్రిమినాశని స్ర్పే చేశారు. ఆ వీధిని మూసివేశారు. 

Updated Date - 2020-06-26T19:51:12+05:30 IST