రాజమహేంద్రవరంలోనే రైళ్లకు హాల్ట్
ABN , First Publish Date - 2020-06-06T09:03:22+05:30 IST
రాజ మహేంద్రవరంలోనే రైళ్లు ఆగుతాయి. జిల్లాలో ఇక ఏ స్టేషన్లోను
ఎక్కాలన్నా దిగాలన్నా ఇక్కడ నుంచే..
ప్రస్తుతం 8 రైళ్ల రాకపోకలు
మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు
రాజమహేంద్రవరం, జూన్ 5(ఆంధ్రజ్యోతి) : రాజ మహేంద్రవరంలోనే రైళ్లు ఆగుతాయి. జిల్లాలో ఇక ఏ స్టేషన్లోను ప్రస్తుతానికి రైళ్లకు హాల్ట్ లేదు. కరోనా లాక్డౌన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై తీవ్రంగా ఉంది. జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైళ్లు తిరుగుతాయనే సమాచారంతో ప్రయాణికులు ఆనందించారు. అన్న ట్టుగానే రైళ్లు తిరగడం ప్రారంభమయ్యాయి. 8 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ కేవలం రాజమహేంద్రవరం స్టేషన్లోనే ఆగుతాయి. అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని వంటి స్టేషన్లలో ఎక్కడా ఆగవు. మిగతా చిన్న స్టేషన్ల సంగతి సరేసరి. జిల్లాలో ఏమూల నుంచి రైలు ప్రయాణం చేయాలన్నా రాజమహేంద్రవరం రావలసిందే. ఎక్కాలన్నా, దిగాలన్నా ఇక్కడి నుంచే.
గోదావరి విశాఖ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళుతుంది. విశాఖ నుంచి 02727 నెంబర్తో బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి 02728 నంబర్తో విశాఖ వెళుతుంది. ఇంకా విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్, హౌరా తదితర రైళ్లు వెళుతున్నాయి. ఇవన్నీ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆగుతాయి. అయితే అన్ని స్టేషన్లలో టిక్కెట్ రిజర్వేషన్ల సౌకర్యం మాత్రం ఉంటుంది.