యాచకులకు ఆవాసం, భుక్తి
ABN , First Publish Date - 2021-10-27T06:42:57+05:30 IST
తిరుపతి నగరంలోని యాచకులకు ఆవాసం, భుక్తి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు.
పోలీస్, మున్సిపల్ అధికారుల కార్యాచరణ
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 26: తిరుపతి నగరంలోని యాచకులకు ఆవాసం, భుక్తి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని యాచకుల్లేని నగరంగా తీర్చిదిద్దాలని పోలీసు, మున్సిపల్ శాఖ అధికారులు నిశ్చయించారు. ఆమేరకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పనకు మంగళవారం కార్పొరేషన్ అధికారులతో ఎస్పీ సమావేశమై చర్చించారు. ముందుగా యాచకులను గుర్తించి, వారికి కుటుంబ సభ్యులుంటే అప్పగిస్తామన్నారు. పెద్దల ఆలనా పాలనా చూసుకోకుండా వదిలేయడం నేరమంటూ కౌన్సెలింగ్ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల్లేని వారికి అనాథాశ్రమాల్లో ఆవాసం కల్పిస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ అంశాలపైనా కార్పొరేషన్ అధికారులతో చర్చించినట్టు ఎస్పీ తెలిపారు. ఇటీవల వెస్ట్ చర్చి రైల్వే అండర్బ్రిడ్జి వద్ద వర్షపునీటిలో వాహనం మునిగి మహిళ మృతిచెందినటు వంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ మరింత సాఫీగా సాగేలా మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఆరీఫుల్లా, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి, వెస్ట్, ఈస్ట్ డీఎస్పీలు నరసప్ప, మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్రెడ్డి, టౌన్ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.