గురుదేవులందరికీ ప్రణామాలు: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2020-07-05T22:34:58+05:30 IST
మనో వికాసానికి గురువే మూలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన..
అమరావతి: మనో వికాసానికి గురువే మూలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ‘‘గురుసాక్షాత్ పరబ్రహ్మ’’.. అని గురువును పూజించడం ఉత్కృష్టమైన భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. విజ్ఞాన సముపార్జనకు గురువే మూలమని తెలిపారు. గురువే జీవిత మార్గదర్శి అని, తల్లిదండ్రుల తరువాత అంతటి గొప్పస్థానంలో నిలిచేది గురువే అన్నారు. అటువంటి గురువులను ప్రత్యేకంగా గౌరవించుకునే గురు పౌర్ణిమ నేడని ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ విజ్ఞానాన్ని నాలుగు వేదాలలో నిబిడీకృతం చేసిన ఆది గురువు వేదవ్యాసులు ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించడం భారతీయుల భాగ్యమని, ఆయనను స్మరించుకుంటూ కళ్లెదుట కనిపించే గురువులకు ఫలాలు, పుష్పాలు, కానుకలు సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకునే మహత్తరమైన రోజు ఈ గురు పౌర్ణమి అని తెలిపారు. కఠోర సాధనతో ఆర్జించిన జ్ఞాన సంపదను మానవాళి వికాసానికి, దేశ సౌభాగ్యం కోసం పంచిపెడుతున్న గురుదేవులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా తన తరపున, జనసేన పార్టీ తరపున ప్రణామాలు అర్పిస్తున్నట్టు పవన్ తెలిపారు.