భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
ABN , First Publish Date - 2021-07-25T05:58:31+05:30 IST
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
చినకంచిలో విశేష పూజలు
శాకంబరిగా దర్శనమిచ్చిన గంగానమ్మ
విజయవాడ రూరల్, జూలై 24 : మండలంలోని పలు ఆలయాల్లో గురుపౌర్ణమిని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నున్న శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయం (చినకంచి)లో వ్యాస పూర్ణిమ పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ ముక్కపాటి శర్మ నేతృత్వంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోడపాడు గంగానమ్మ ఆలయంలో టీటీడీ, దేవదాయశాఖ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ పూజలు జరిగాయి. అలాగే అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు ధర్శనమిచ్చారు. శివాచార్య మామిళ్లపల్లి ఫణికుమార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని ఎంపీడీవో సునీత కుటుంబ సభ్యుల తో కలసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. నున్న సాయిబాబా ఆలయం, పాతపాడు, కుందావారి కండ్రిక, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడిలోని ఆలయాల్లోనూ పూర్ణిమ పూజలు జరిగాయి.
బాపులపాడు సాయిబాబా మందిరంలో
హనుమాన్జంక్షన్ : గురు పౌర్ణమి సందర్భంగా బాపుల పాడు సాయిబాబా మందిరంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహించారు. భక్తులకు మందిరం నిర్వాహా కులు అన్నదానం చేశారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు సతీసమేతంగా మందిరాన్ని సందర్శించారు. సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని నిర్వాహాకులు కొల్లి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు సోమరాజు, వడ్డిల్లీ లక్ష్మి, గొట్టుముక్కల పద్మనాభరాజు పర్యవేక్షించారు.
వీరవల్లిలో
హనుమాన్జంక్షన్ రూరల్ : వీరవల్లి సాయిబాబా ఆలయంలో శనివారం గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయన పంచామృతాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంక సరోజినీదేవి, బేబి ఆధ్వ ర్యంలో మహిళా భక్తులు బాబా అష్టోత్తర శతనామావళి గానం చేశారు. బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయ కమిటీ సభ్యులు కోడెబోయిన బాబి, అరవపల్లి సీతారామయ్య, రావి ఈశ్వర్ ఏర్పాట్లనుపర్యవేక్షించారు.
గన్నవరం మండలంలో
గన్నవరం : మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు శనివారం జరిగాయి. దావాజీగూడెంలోని సరస్వతిదేవి, పాత గన్నవరంలోని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ శాకంబరీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకుడు జాస్తి శ్రీధర్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. గురుపూర్ణిమను పురస్కరించుకుని గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఉత్సవమూర్తులను, ఆలయ ప్రాంగణంలోని మానుచెట్టును కూరగాయలతో అలంకరించారు. తొలుత భక్తులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లోనూ గురుపూర్ణిమ పూజలు జరిగాయి.
శాకంబరీదేవిగా పార్వతీదేవి
పెనమలూరు : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శనివారం పెనమలూరు భీమేశ్వరస్వామి ఆలయంలో పార్వతీదేవిని పండ్లు, కూరగాయలతో శాకాంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా రామ లక్ష్మణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అరవింద శర్మ, భక్తులు పాల్గొన్నారు.
గండిగుంటలో..
ఉయ్యూరు : గురుపౌర్ణమి పురస్కరించుకుని మండలం లోని పలు సాయిబాబా మందిరాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. గండిగుంటలో బాబా విగ్రహానికి మందిర ట్రస్టీలు కంచర్ల గంగాధరరావు, ఉషారామకృష్ణ ఆధ్వర్యంలో గులాబీ, పలురకాల పుష్పాలతో అలంకరణ చేశారు. ఉయ్యూరు శివాలయం రోడ్డులోని సాయిబాబా మందిరం లో ప్రత్యేక పూజలు చేశారు.