డేరాబాబాకు జీవిత ఖైదు
ABN , First Publish Date - 2021-10-18T22:55:39+05:30 IST
రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్, మరో నలుగురికి పంచకులలోని ప్రత్యేక...
న్యూఢిల్లీ: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్, మరో నలుగురికి పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారంనాడు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించింది. దీనితో పాటు డేరా బాబాకు రూ.31 లక్షల జరిమానా, ఇతరులకు రూ.50,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. డేరా సచ్చా సౌదాకు అనుచరుడిగా పేరున్న రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. కురుక్షేత్రలోని ఖాన్పూర్ కొలియన్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ తన గ్రామంలో పొలం పనులు చేసుకుంటుండగా అతన్ని అగంతకులు కాల్చిచంపారు. డేరా బాబా మహిళలను లైంగికంగా ఏవిధంగా లొంగదీసుకునే వారో తెలియజేసే ఒక లేఖ బయటకు రావడం వెనుక రంజిత్ సింగ్ ప్రమేయం ఉందనే అనుమానంతోనే ఈ హత్య జరిగినట్టు చెబుతారు.
కాగా, 2003లో పంజాబ్, హర్యానా హైకోర్టు ఉచ్చిన ఉత్తర్వులతో సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి ముందు ఈ కేసు సదర్ పోలీస్ స్టేషన్లో నమోదయింది. కేసు దర్యాప్తును తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ నాలుగేళ్ల పాటు విచారణ జరిపి 2007 జూలైలో ఆరుగురు నిందితులపై ఛార్జిషీటు నమోదు చేసింది. 2008 డిసెంబర్లో ఆరోపణలు నమోదు చేసింది. విచారణ సమయంలో నిందితులలో ఒకరు గత ఏడాది మరణించాడు.
రామ్ రహీమ్ ప్రస్తుతం ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో రోహ్తక్ సునరియా జైలులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులోనూ దోషిగా నిర్దారణ కావడంతో ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది.