Kapurthala lynching case: గురుద్వారా కేర్టేకర్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-24T22:58:59+05:30 IST
సంచలనం సృష్టించిన కపుర్తల లించింగ్ కేసులో పోలీసులు నేడు గురుద్వారా కేర్ టేకర్ అమర్జీత్ సింగ్ను
కపుర్తల(పంజాబ్): సంచలనం సృష్టించిన కపుర్తల లించింగ్ కేసులో పోలీసులు నేడు గురుద్వారా కేర్ టేకర్ అమర్జీత్ సింగ్ను అరెస్ట్ చేశారు. హత్య, హత్యాయత్నం అభియోగాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19న కపుర్తలలోని నిజామ్పూర్ గ్రామంలోని గురుద్వారాలోకి ప్రవేశించిన యువకుడు గురుద్వారా పైనున్న నిషాన్ సాహిబ్ (సిక్కుమత జెండా)ను తొలగించేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భక్తులు గురుద్వారాను అపవిత్రం చేశాడన్న ఆగ్రహంతో అతడిని కొట్టి చంపారు.
అయితే, అతడు అపవిత్రం చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, దొంగతనానికి మాత్రమే ప్రయత్నించాడని కపుర్తల పోలీసులు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయం చెప్పారు. అతడు దైవాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
కాగా, కపుర్తల ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గర్భగుడిలోకి చొరబడి సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసే ప్రయత్నం చేయడంతో అతడిని కూడా కొట్టి చంపేశారు. 24 గంటల వ్యవధిలోనే ఒకేరకమైన రెండు ఘటనలు జరగడం సంచలనమైంది.