బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ABN , First Publish Date - 2022-06-26T05:47:53+05:30 IST

ఎస్‌సీ, ఎస్‌టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని డెవలప్‌మెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ బోర్డు ఫర్‌ డీ నోటిఫైడ్‌ నోమడిక్‌ అండ్‌ సెమీ నోమడిక్‌(డీడబ్ల్యూబీడీఎన్‌సీ) సభ్యుడు తురక నరసింహా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి
కలెక్టరేట్‌లోని మినీ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమీక్షలో పాల్గొన్న డీడబ్ల్యూబీడీఎన్‌సీ సభ్యుడు నరసింహా

డీడబ్ల్యూబీడీఎన్‌సీ సభ్యుడు తురక నరసింహా


గుంటూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎస్‌సీ, ఎస్‌టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని డెవలప్‌మెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ బోర్డు ఫర్‌ డీ నోటిఫైడ్‌ నోమడిక్‌ అండ్‌ సెమీ నోమడిక్‌(డీడబ్ల్యూబీడీఎన్‌సీ) సభ్యుడు తురక నరసింహా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌కి వచ్చిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులు, వాటిల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, బాధితులకు ఎలాంటి పరిహారం అందింది అనే అంశాలను తొలుత సమీక్షించారు. కొవిడ్‌-19కి సంబంఽధించి జిల్లాలో నమోదైన కేసులు, మరణాలు, రికవరీల పైనా సమీక్ష నిర్వహించారు. నాల్గో దశ కోవిడ్‌కి సంబంధించి తీసుకొంటున్న ముందస్తు జాగ్రత్తలను అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో ఉన్న అడవులు, గిరిజనులకు వాటిపై ఉన్న హక్కులు గురించి సమీక్షించారు. మైనింగ్‌లో పని చేసే కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో తగినంత శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌  వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, గిరిజన సంక్షేమ అధికారి  కోటేశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శోభారాణి, బీసీ సంక్షేమ అధికారి వై.నరసారెడ్డి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ డి.దుర్గాబాయి, మైనింగ్‌ ఏడీ ఫణిభూషణ్‌రెడ్డి, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ ప్రేమ కుమారి, ఏఎస్‌డబ్ల్యూవో కె.సత్యన్నారాయణ, డీఈవో శైలజ, అటవీ శాఖ అధికారి రామచంద్రరరావు హాజరయ్యారు. 

Updated Date - 2022-06-26T05:47:53+05:30 IST