పక్కా ప్లాన్తో.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతోనే ఫోన్ చేయించి..
ABN , First Publish Date - 2020-07-09T15:09:48+05:30 IST
వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో..
వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య
పోలీసులకు లొంగిపోయిన నలుగురు నిందితులు
మాచర్ల(గుంటూరు): వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో జూన్ 22న జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు బుధవారం వెల్లడించారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల విషయంలో హత్యజరిగినట్లు చెప్పారు. దుర్గికి చెందిన పట్టాభి అమరలింగయ్య వ్యవసాయం చేస్తుంటాడు. అతను బండి చెన్నయ్య భార్యతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై చెన్నయ్య పలుమార్లు మందలించినా అమరలింగయ్య తీరు మార్చు కోలేదు. ఈక్రమంలో తన కుటుంబం పరువు పోతుందని మానసికంగా కృంగిపోయిన చెన్నయ్య కక్షపెంచుకున్నాడు.
అమరలింగయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో మహిళకు తోట వెంకటేశ్వర్లు బంధువు అవుతాడు. ఈ క్రమంలో చెన్నయ్య, వెంకటేశ్వర్లు, మరొక వ్యక్తి గంధం రాంబాబుతో కలిసి అమరలింగయ్యను హత్యచేసేందుకు ఆ మహిళ సాయం తీసుకున్నారు. తమకు సహకరించకుంటే వివాహేతర సంబంధం విషయం బయట పెడతామని, చెడుగా ప్రచారం చేస్తామని ఆమెను బెదిరించారు. ఆమె ద్వారా అమరలింగయ్యను మభ్యపెట్టి పథకం ప్రకారం దావుపల్లి గ్రామశివారు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బండరాయితో మొహంపై మోది కత్తితో గొంతుకోసి హత్యచేశారు. బుధవారం చెన్నయ్య, వెంకటేశ్వర్లు, రాంబాబు, వెంకటేశ్వర్లు బంధువు అయిన మహిళ దుర్గి వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో పట్టణ సీఐ రాజేశ్వరరావు, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, దుర్గి ఎస్ఐ రామాంజనేయులు తదితరులు ఉన్నారు.