రమ్య కుటుంబ సభ్యులకు ఇళ్ళ పట్టాను అందించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2021-08-20T19:04:28+05:30 IST

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి

రమ్య కుటుంబ సభ్యులకు ఇళ్ళ పట్టాను అందించిన హోంమంత్రి

గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్థఫా, మద్దాలి గిరి, మేరుగ నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా రమ్య కుటుంబ సభ్యులకు హోంమంత్రి  సుచరిత ఇళ్ళ పట్టాను అందజేశారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ...రమ్య మృగాడి చేతిలో బలైందని...నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశామన్నారు. సీఎం...ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మౌనికకు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రమ్య నిందితుడు గురించి తల్లిదండ్రులకు ముందే చెప్పి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసే వాళ్ళని అన్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతే దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. 


ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ..బాధిత కుటుంబానికి ఇవ్వాల్సినవన్ని ఇవ్వాలని సీఎం వ్యక్తిగత శ్రద్ద తీసుకొని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


ఎంపి నందిగం సురేష్ మాట్లాడుతూ...సీఎం స్వంత కుటుంబ సభ్యుల్లా తమను చూస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులే చెప్పారన్నారు. సమాజంలో జనాలు సామాజిక బాధ్యత మరిచిపోయారని, సృహ కోల్పోయారని అన్నారు. నిందితుడు బక్క పల్చగా ఉన్నాడని..చోద్యం చూసిన వాళ్ళంతా బాధ్యత వహించాలని హితవుపలికారు. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుందని తెలిపారు. రమ్య వైపు తప్పు లేకపోయిన హత్య చేశాడన్నారు. సోషల్ మీడియా  వలన లాభాలు కంటే నష్టాలే ఎక్కువని...అవసరం ఉంటేనే ఫోన్ వాడుకోవాలని సూచించారు. కొంతమంది శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-20T19:04:28+05:30 IST