ఆర్టీసీ టిక్కెట్ల జారీ.. సులభతరం
ABN , First Publish Date - 2020-07-11T12:29:43+05:30 IST
ఆర్టీసీ టిక్కెట్ల జారీ.. సులభతరం
ప్రయోగాత్మకంగా ప్రథమ్ యాప్
గుంటూరు 1, 2 డిపోల ఎంపిక
ఈనెల 20 నుంచి అమలుకు సన్నాహాలు
గుంటూరు: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్టీసీలో టిక్కెట్ల జారీని సులభతరం చేసేందుకు ఆర్టీసీ యంత్రాంగం ప్రథమ్ అనే యాప్ను అందుబాటులోకి తెస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణకు నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు యాప్ ద్వారా టిక్కెట్లను జారీ చేయనున్నారు. రాష్ట్రంలో 19 డిపోల్లో ఈ యాప్ ద్వారా టిక్కెట్లను ప్రయోగాత్మకంగా జారీ చేయనున్నారు.
ఇందులో భాగంగా గుంటూరు రీజియన్లో గుంటూరు-1, 2 డిపోలను ఎంపిక చేశారు. ఈనెల 20వ తేదీ నుంచే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రథమ్ యాప్ విధివిధానాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో యంత్రాంగం ఉంది. ఇప్పటికే బస్టాండ్లో గ్రౌండింగ్ బుక్ చేసుకొనే ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసిన అధికారులు నగదు రహిత లావాదేవీలతో ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకొనే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా ఆన్లైన్ బుకింగ్ రాని ప్రయాణీకులకు బస్టాండ్కు వెళితే అక్కడే ఆర్టీసీ సిబ్బంది ఆన్లైన్లో బుక్ చేసేలా కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
క్యూ ఆర్ కోడ్ కూడా...
ప్రథమ్ యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపేలా వీలుంటుంది. క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు బదిలీ చేసే సౌలభ్యాన్ని కల్పిస్తారని అధికారులు చెబుతున్నారు. ఒక రూట్లో వెళ్ళే డ్రైవర్, కండక్టర్ వద్ద టిక్కెట్ల జారీకి సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో ఉంటుందని, దీనికి డిపో మేనేజర్ కూడా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఏ టైమ్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుందన్నారు.
సిబ్బందికి శిక్షణ ప్రారంభించాం..
ప్రథమ్ యాప్ను రీజియన్లో గుంటూరు-1, 2 డిపోలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నాం. ఈ మేరకు ఆయా డిపోల అధికారులు, సిబ్బందికి యాప్పై అవగాహనకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. యాప్లో అనేక ఫీచర్స్ ఉంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు యాప్ ఎంతో ఉపయోగపడనున్నది.
- ఎస్టీపీ రాఘవకుమార్, ఆర్టీసీ ఆర్ఎం