గవరపాలెంలో తుపాకుల కలకలం
ABN , First Publish Date - 2020-12-05T06:02:32+05:30 IST
గవరపాలెం ఎన్టీఆర్ కాలనీలో తుపాకులు బయటపడిన వ్యవహారం కలకలం రేపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నివాసంలో రెండు తుపాకులు (పిస్టళ్లు), 18 బులెట్లు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతి చెందిన వ్యక్తి ఇంట్లో రెండు తుపాకులు, 18 బులెట్లు
విచారణ చేపడుతున్న పోలీసులు
అనకాపల్లి టౌన్, డిసెంబరు 4: గవరపాలెం ఎన్టీఆర్ కాలనీలో తుపాకులు బయటపడిన వ్యవహారం కలకలం రేపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నివాసంలో రెండు తుపాకులు (పిస్టళ్లు), 18 బులెట్లు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎబ్రాడ్లో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన భీశెట్టి లోకనాథరావు 2015 నుంచి అనకాపల్లిలోని తన నివాసంలో ఉంటున్నాడు. ఆయన మద్యానికి అలవాటుపడి కుటుంబ సభ్యులతో సరిగా ఉండకపోవడంతో భార్య కొంతకాలం నుంచి వేరుగా జీవిస్తున్నారు. ఒంటరితనంతో మనస్తాపానికి గురైన లోకనాథరావు గత నెల 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ 27న మృతి చెందారు.
ఇదిలా ఉండగా లోకనాథరావు ఇంటిని అతని కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శుభ్రం చేస్తుండగా రెండు దేశవాళీ తుపాకులు, 18 బులెట్లు కనిపించాయి. దీంతో మృతుని మావయ్య కర్రి శ్రీనివాసరావు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా తుపాకులు కలిగి ఉండడంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు తెలిపారు.