గుమ్మడిదుర్రులో అధికార పార్టీ దుశ్చర్యలు అడ్డుకోండి
ABN , First Publish Date - 2022-01-29T06:27:05+05:30 IST
గుమ్మడిదుర్రులో అధికార పార్టీ దుశ్చర్యలు అడ్డుకోండి
పోలీసులకు మాజీ సర్పంచ్ పొన్నం రంగారావు విజ్ఞప్తి
పెనుగంచిప్రోలు, జనవరి 28: మండలంలోని గుమ్మడిదుర్రు గ్రామంలో శాంతియుత వాతవరణానికి భంగం కలిగించేందుకు కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న దుశ్చర్యలను అడ్డుకోవాలని నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్కు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పొన్నం రంగారావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో సర్పంచ్గా గెలిచి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశానని, టీడీపీకి బలమైన పునాదులు వేశానని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాని కొందరు, ఏదో రకంగా ఇబ్బందిపెట్టి రాజకీయాలకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసుల్లో ఇరికించడంతో పాటు, గత నెలలో వరికోత యంత్రాన్ని పాడుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గురువారం రాత్రి తన వ్యవసాయ భూమికి వినియోగించే విద్యుత్ బోర్డులను ధ్వంసం చేశారన్నారు. తనకు జరిగిన అన్యాయం, నష్టంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని, దుశ్చర్యలకు కారణమైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంత వాతవ రణాన్ని భంగం కలిగించకూడదని, కార్యకర్తలు, తమ పార్టీ నేతలు సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.