Covid నిర్మూలనకు ప్రదర్శన... 46 మంది అరెస్ట్...
ABN , First Publish Date - 2021-05-06T21:00:59+05:30 IST
వేధిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని తరిమి కొట్టాలనే లక్ష్యంతో
అహ్మదాబాద్ : వేధిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని తరిమి కొట్టాలనే లక్ష్యంతో ప్రదర్శన జరిపిన 46 మందిని గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇటువంటి ప్రదర్శనలు జరగడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.
డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ ఎంకే రాణా మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నిర్మూలన కోసం గాంధీ నగర్ జిల్లాలోని రాయ్పూర్లో ప్రదర్శన నిర్వహించారని చెప్పారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషనను ఉల్లంఘించినందుకు ఈ ప్రదర్శనలో పాల్గొన్న 46 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు కోవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని చెప్పారు. గ్రామ దేవతకు అభిషేకం చేయడం వల్ల కరోనా వైరస్ అంతమవుతుందని వీరు నమ్ముతున్నట్లు తెలిపారు. వీరంతా విపత్తు నిర్వహణ చట్టం, అంటు వ్యాధుల చట్టం వంటివాటిని ఉల్లంఘించినట్లు తెలిపారు.
మే 3న నవపుర గ్రామంలో కూడా ఇదేవిధంగా ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సహా 23 మందిని అరెస్టు చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అన్ని రకాల ప్రదర్శనలను గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది.
గురువారం ఉదయం నుంచి వైరల్ అవుతున్న ఓ వీడియోలో సుమారు 100 మంది స్త్రీ, పురుషులు ప్రదర్శనగా వెళ్తున్నట్లు కనిపించింది. వీరిలో చాలా మంది మాస్క్లను ధరించలేదు. మహిళలు తమ తలపై కుండలతో నీళ్ళు పట్టుకెళ్తున్నట్లు కనిపించింది.