స్మార్ట్ఫోన్ కొనుక్కునేందుకు రైతులకు రూ. 1500 ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-11-21T21:45:50+05:30 IST
ప్రస్తుత స్మార్ట్ఫోన్ యుగంలో ఏ పని చేయాలన్నా చేతిలో సెల్ ఉండాల్సిందే. విద్య, వైద్యం నుంచి సమస్త సమాచారాన్ని ఒక్క క్లిక్తో
అహ్మదాబాద్: ప్రస్తుత స్మార్ట్ఫోన్ యుగంలో ఏ పని చేయాలన్నా చేతిలో సెల్ ఉండాల్సిందే. విద్య, వైద్యం నుంచి వ్యవసాయం, వాతావరణం వరకు సమస్త సమాచారాన్ని ఒక్క క్లిక్తో స్మార్ట్ఫోన్లో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతు తప్పనిసరిగా స్మార్ట్ఫోన్ ఉపయోగించేలా చూడాలన్న లక్ష్యంతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసుకునేందుకు ప్రతి రైతుకు రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపింది.
తద్వారా వ్యవసాయాధారిత ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు వ్యవసాయ రంగంలో అందిస్తున్న డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం వారికి సులభంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడేనని, రూ. 1500కు మించకుండా ఫోన్ మొత్తం ధరలో 10 శాతాన్ని సాయంగా పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
స్మార్ట్ఫోన్ ఒక్కదానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, బ్యాకప్ డివైజ్లు, ఇయర్ఫోన్స్, చార్జర్ తదితర వాటికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా వాతావరణ వివరాలు, తెగుళ్లు, వ్యవసాయ శాఖ పథకాలు, వ్యవసాయంలో ఆధునిక విధానాలు, నిపుణుల సలహాలు, సూచనలు తదితర వాటిని తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.