మాంసాహార స్టాళ్లపై గుజరాత్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-11-16T21:42:02+05:30 IST

గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు

మాంసాహార స్టాళ్లపై గుజరాత్ సంచలన నిర్ణయం

గాంధీనగర్: గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు 100 మీటర్ల సమీపంలోని ఫుడ్‌స్టాళ్లలో మాంసాహారం విక్రయించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయం చిరు వ్యాపారులను షాక్‌కు గురిచేసింది.


ప్రభుత్వం నిర్ణయంతో తాము జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారాన్ని అనుమతించి రోడ్డు పక్కన స్టాళ్లలో మాత్రం అమ్మకూడదనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాంసాహారం వాసన రోడ్డుపైన స్టాళ్లలో మాత్రమే వస్తుందా? హోటళ్లలో రాదా? అని ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.


రోడ్డు పక్క స్టాళ్లలో మాంసాహార విక్రయాల నిషేధంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. ప్రజల భిన్నమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదని, అయితే, పరిశుభ్రత, పౌర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


‘‘కొంతమంది శాకాహారం తింటారు. మరికొందరు మాంసాహారం తీసుకుంటారు. దీనివల్ల బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. అయితే, రోడ్డు పక్కన బళ్లపై విక్రయించే ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే బండ్లను మునిసిపల్ అధికారులు తొలగిస్తారన్నారు.  

Updated Date - 2021-11-16T21:42:02+05:30 IST