కరోనా నుంచి కోలుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. మాస్క్ లేకుండా ఆలయంలో చిందులు!

ABN , First Publish Date - 2020-09-20T22:33:25+05:30 IST

వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్ మరోమారు తన చర్యలతో వివాదాల్లోకి

కరోనా నుంచి కోలుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. మాస్క్ లేకుండా ఆలయంలో చిందులు!

గాంధీనగర్: వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్ మరోమారు తన చర్యలతో వివాదాల్లోకి ఎక్కారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన వడోదరలోని ఓ రద్దీ ఆలయంలో తన మద్దతుదారులతో కలిసి కరోనా నిబంధనలను గాలికి వదిలేసి భజనలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేశారు. ముఖానికి మాస్క్ కూడా ధరించకుండా ఆలయంలో హల్‌చల్ చేశారు. 


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సొంతంగా నిర్మించిన సినిమాల్లోనూ నటించిన శ్రీవాస్తవ్ ఆలయంలో భజన్లకు డ్యాన్స్ చేశారు. ఆయన మద్దతుదారులు మరింత ఉత్సాహ పరచడంతో మరింతగా చెలరేగిపోయారు. ఇద్దరు మ్యుజీషియన్ల తప్ప ఆలయ పూజారి సహా ఎవరూ ముఖానికి మాస్క్ ధరించలేదు. 


ఈ వీడియోపై శ్రీవాస్తవ స్పందించారు. ఆలయంలో డ్యాన్స్ చేసింది తానేనని అంగీకరించారు. తాను గత 45 ఏళ్లుగా ఆలయానికి వెళ్తున్నానని, ప్రతి శనివారం ఇలాగే చేస్తుంటానని, ఇదేమీ కొత్తకాదని స్పష్టం చేశారు. కరోనా మార్గదర్శకాలను తాను పాటించలేదని అంగీకరించిన ఎమ్మెల్యే.. ప్రజలు సమావేశమయ్యేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఆ సమయంలో ఆలయంలో కొంతమందే ఉన్నారని, అది తన ప్రైవేటు కార్యక్రమమని ఎమ్మెల్యే వివరించారు. ఆలయం తనదేనని, ఆలయం లోపల మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు. శ్రీవాస్తవ తీరుపై స్పందించేందుకు సీనియర్ బీజేపీ నేతలు స్పందించేందుకు నిరాకరించారు.

Updated Date - 2020-09-20T22:33:25+05:30 IST