నాన్ వెజ్ అమ్మకాలపై కఠిన చర్యలొద్దు : గుజరాత్ బీజేపీ చీఫ్

ABN , First Publish Date - 2021-11-21T15:36:02+05:30 IST

రోడ్ల పక్కన మాంసాహారం విక్రయించే దుకాణదారులపై కఠిన

నాన్ వెజ్ అమ్మకాలపై కఠిన చర్యలొద్దు : గుజరాత్ బీజేపీ చీఫ్

రాజ్‌కోట్ : రోడ్ల పక్కన మాంసాహారం విక్రయించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవద్దని మేయర్లను ఆదేశించినట్లు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. మెయిన్ రోడ్లలోని నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాళ్ళను తొలగించాలని కొన్ని బీజేపీ పాలిత స్థానిక సంస్థలు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. 


మన దేశంలో ప్రతి ఒక్కరికీ తాము తినవలసినదానిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని చెప్పారు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అమ్మే వ్యక్తి నుంచి ప్రజలు దానిని కొనుక్కుంటున్నపుడు ఆ వ్యక్తిని ఆ దుకాణాన్ని తొలగించాలని కోరడం సరికాదని చెప్పారు. చట్టంలో కూడా అటువంటి నిబంధన లేదన్నారు. నిషేధిత పదార్థాలను తప్ప మిగిలినవాటిని అమ్ముకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు. రోడ్లపై నుంచి ఫుడ్ స్టాళ్లను తొలగించే ప్రసక్తే లేదన్నారు. 


రాజ్‌కోట్ నగర పాలక సంస్థ ఇటీవల రోడ్లపై నుంచి మాంసాహార విక్రయ కేంద్రాలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. రోడ్లను ఆక్రమించి వీటిని నిర్వహిస్తున్నారని, శాకాహారుల మతపరమైన మనోభావాలను గాయపరుస్తున్నారని పేర్కొంది. దీంతో మరికొన్ని స్థానిక సంస్థలు కూడా ఇటువంటి ఆదేశాలు ఇచ్చాయి. 


Updated Date - 2021-11-21T15:36:02+05:30 IST