సెలవుపై సొంతూరికెళ్లిన భారత సైనికుడికి పాక్ నుంచి ఫోన్ కాల్.. టెక్నికల్ టీమ్కు డౌట్.. నిఘా వేసి ఆరా తీస్తే వెలుగులోకి భయంకర నిజాలు..!
ABN , First Publish Date - 2021-10-26T02:05:57+05:30 IST
అతడు ఓ ఆర్మీ జవాన్. పంజాబ్లో విధులు నిర్వరిస్తున్నాడు. ఈ మధ్యే సొంతూరుకు వెళ్లిన అతడికి పాక్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయం పంజాబ్ పోలీసులు ఏర్పాటు చేసిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (ఎస్ఎస్ఓసీ) దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో నిఘా వేసిన
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఓ ఆర్మీ జవాన్. పంజాబ్లో విధులు నిర్వరిస్తున్నాడు. ఈ మధ్యే సొంతూరుకు వెళ్లిన అతడికి పాక్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయం పంజాబ్ పోలీసులు ఏర్పాటు చేసిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (ఎస్ఎస్ఓసీ) దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో నిఘా వేసిన అధికారులు విషయం ఆరా తీయగా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్కు చెందిన కృనాల్ కొన్న సంవత్సరాల క్రితం ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఐటీ విభాగంలో అతడు విధుల నిర్వర్తిస్తున్నాడు. తాజాగా కృనాల్ సెలవుపై గుజరాత్లోని తన సొంత ఊరికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడికి పాక్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కృనాల్ ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ పంజాబ్కు చెందిందే కావడంతో.. ఈ ఫోన్ కాల్ వ్యవహారం పంజాబ్ పోలీసులు ఏర్పాటు చేసిన స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు విషయం ఆరా తీయగా సంచలన విషయాలు బటయపడ్డాయి.
కృనాల్ గత రెండేళ్లుగా పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ సిద్రా ఖాన్తో వాట్సప్ కాల్ ద్వారా టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా ఈ రెండేళ్ల కాలంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆయుధాలు తదితర అనేక విషయాలను కృనాల్ ఐఎస్ఐ ఏజెంట్కు చేరవేసినట్టు తేలింది. దీంతో పంజాబ్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కృనాల్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కృనాల్ ఏఏ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం ఐఎస్ఐ ఏజెంట్ కృనాల్కు అప్పగించిన టాస్క్ ఏంటనే వివరాలపై పంజాబ్ పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా కృనాల్ ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. ఇదే సమయంలో ఈ విషయంపై సీరియస్గా దృష్టిసారించిన ఆర్మీ అధికారులు.. కృనాల్ ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడు. అతడితో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రెండు సంవత్సరాలుగా కృనాల్ ఈ దారుణానికి పాల్పడుతున్నప్పటికీ ఈ విషయం బటయపడకపోవడానికి గల కారణాలను పంజాబ్ పోలీసులు వెల్లడించారు. కృనాల్ రెండు సంవత్సరాలుగా వాట్సప్ కాల్ ద్వారా పాక్ ఏజెంట్తో టచ్లో ఉన్నాడని దీంతో ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయితే కృనాల్ సెలవుపై స్వస్థలానికి వెళ్లడం.. అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం పాక్ ఏజెంట్ సాధారణ కాల్ ద్వారా కృనాల్కు ఫోన్ చేసినట్టు పేర్కొన్నారు. కృనాల్ వాడుతున్న ఫోన్ నెంబర్ పంజాబ్ది కావడంతో అతడి వ్యవహారం.. ఇండియా-పాక్ మధ్య స్మగ్లర్ల సంబంధాలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఓసీ దృష్టికి వచ్చినట్టు వివరించారు. దీంతో విషయం ఆరా తీస్తే కృనాల్ గుట్టు బయటపడినట్లు వెల్లడించారు.