ఆపన్న హస్తం కోసం..
ABN , First Publish Date - 2020-08-07T10:28:28+05:30 IST
ఆస్పత్రిలో అచేతనంగా పడిఉన్న ఈమె పేరు గుడియా పద్మిని(26). ఈమెది సోంపేట మండలం ఇస్కలపాలెం గ్రామం. భర్త భువనేష్, ఏడాది వయసున్న ..
డెంగ్యూతో చలనం కోల్పోయిన మహిళ
చికిత్సకు డబ్బుల్లేక ఆస్పత్రి నుంచి
ఇంటికి తీసుకొచ్చేసిన కుటుంబ సభ్యులు
దాతలు సాయం చేయాలని వేడుకోలు
ఆస్పత్రిలో అచేతనంగా పడిఉన్న ఈమె పేరు గుడియా పద్మిని(26). ఈమెది సోంపేట మండలం ఇస్కలపాలెం గ్రామం. భర్త భువనేష్, ఏడాది వయసున్న శిరీష అనే కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లో ఆనందంగా బతికేవారు. అందరిలాగే ఆరోగ్యంగా ఉన్న పద్మినికి 12 రోజుల క్రితం డెంగ్యూ జ్వరం సోకింది. ఇంటి వద్దే చికిత్స పొందడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో విశాఖపట్నంలోకి ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా కాళ్లు, చేతులు చలనం కోల్పోయాయి.
నిరుపేద కుటుంబమైనప్పటికీ సుమారు రూ.4లక్షల వరకు అప్పుచేసి పద్మిని వైద్యం కోసం ఖర్చు చేశారు. ఐదు రోజుల పాటు ఆస్పతిలో ఉన్నా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో చేసేది లేక పద్మినిని ఇంటికి తీసుకొచ్చేశానని భర్త భువనేష్ కన్నీటీపర్యంతమవుతున్నాడు. ప్రస్తుతం తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, దాతలెవరైనా సాయం చేస్తే బతుకుతుందని వేడుకుంటున్నాడు. దీంతో గ్రామస్థులు రూ.11వేలను గురువారం బాధిత కుటుంబానికి అందించారు. సాయం చేయదలచిన వారు గుడియా ఢిల్లేసు, ఎస్బీఐ ఖాతా 35688410776 నంబర్ను సంప్రదించాలని గ్రామస్థులు కోరారు.