జీఎస్టీ పన్ను శ్లాబులు కుదించాలి
ABN , First Publish Date - 2022-07-06T09:16:40+05:30 IST
జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని పరిశ్రమ వర్గాలు మరోసారి ప్రభుత్వాన్ని కోరాయి.
సీఐఐ చైర్మన్ సంజీవ్ బజాజ్
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని పరిశ్రమ వర్గాలు మరోసారి ప్రభుత్వాన్ని కోరాయి. దీనికి తోడు జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న నాలుగు పన్ను శ్లాబులను మూడుకు కుదించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్ కోరారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఇలా చేయడం వల్ల దేశీ పరిశ్రమల ఖర్చులు తగ్గి, పోటీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు.
మినహాయింపు జాబితా మరింత తగ్గిస్తాం: జీఎస్టీ పన్ను ‘మినహాయింపు’ జాబితాలోని వస్తు సేవల జాబితాను మరింత కుదించేందుకు అవకాశం ఉందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. రోజుకు రూ.5,000 కంటే ఎక్కువ అద్దె ఉండే నాన్ ఐసీయూ హాస్పిటల్ రూమ్స్పై ఐదు శాతం జీఎస్టి విధించడాన్ని అయన సమర్ధించారు. దీనివల్ల అందుబాటు ధరల్లో లభించే ఆరోగ్య సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.