మొబైల్స్పై జీఎస్టీ మోత
ABN , First Publish Date - 2020-03-15T07:25:58+05:30 IST
దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే, మొబైళ్లపై జీఎస్టీని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.
- పన్ను 12 నుంచి 18 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే, మొబైళ్లపై జీఎస్టీని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జీఎ్సటీ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్పై పన్నుల పెంపు కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్పై ప్రభావం చూపనుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంటోంది. అంతేకాదు, దేశీయంగా ఫోన్ల తయారీకి ఇది ప్రతికూల పరిణామమేని వాపోయింది. కరోనా వైరస్ విజృంభణతో చైనా నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉందంటూ ఐసీఈఏ ఇప్పటికే ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ తరుణంలో జీఎస్టీ రేటు మరింత పెంచడం తగదని లేఖలో పేర్కొంది. మొబైల్స్తో పాటు వస్త్రాలు, పాదరక్షలు, ఎరువులపైనా పన్ను రేట్లు పెరగవచ్చని జీఎ్సటీ మండలి సమావేశానికి ముందు మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే, కరోనా ప్రభావం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వీటిపై జీఎ్సటీ పెంపు నిర్ణయాన్ని మండలి వాయిదా వేసుకుంది. తాజా సమీక్షలో సవరించిన రేట్లన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని జీఎస్టీ మండలి చర్చించిందని మంత్రి తెలిపారు.
మండలి తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
- విమానాల ఎంఆర్ఓ సేవలిక చౌక
- కరోనా ధాటికి కుదేలవుతున్న ఎయిర్లైన్స్ ప్రభు త్వం కొంత ఊరట కల్పించింది. విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అదీ పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వసతితో. దేశంలో ఎంఆర్ఓ సేవల ప్రారంభానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని సీతారామన్ పేర్కొన్నారు.
- అగ్గి పెట్టెలకు ఒకే పన్ను రేటు
- అగ్గిపెట్టెలకు ఇకపై ఒకే జీఎస్టీ వర్తించనుంది. ప్రస్తుతం చేతితో తయారు చేసే అగ్గిపెట్టెలపై 5 శాతం, యంత్రంతో తయా రు చేసే అగ్గిపెట్టెలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రెండింటికీ 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- జీఎస్టీ నెట్వర్క్ బలోపేతం
- జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)పై అసంతృప్తిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఇన్ఫోసిస్ను కోరింది. అత్యుత్తమ నిపుణులను ఈ పనికి పురమాయించాలని, 2020 జూలై నాటికి సాంకేతిక లోపాల్లేని వ్యవస్థగా మార్చాలని, ఇందుకోసం జీఎస్టీఎన్ హార్డ్వేర్ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించింది. జీఎస్టీఎన్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ను ఇన్ఫోసిస్ రూపొందించింది.
జీఎస్టీ రిటర్నులు, తదితర అంశాలు
* 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్న్, రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ సమర్పించేందుకు గడువు తేదీని 2020 జూన్ 30కి పొడిగించారు.
* రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు 2017-18, 2018-19 వార్షిక రిటర్ను (జీఎస్టీఆర్-9), రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ల (జీఎస్టీఆర్-9సీ) సమర్పణలో జాప్యమైనా లేట్ ఫీజ్ విధించవద్దని మండలి నిర్ణయించింది.
* రూ.5 కోట్లలోపు టర్నోవర్ కలిగిన ఎంఎ్సఎంఈలకు 2018-19 సంవత్సరానికి రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ (జీఎస్టీఆర్-9సీ) సమర్పణను సడలించింది.
* ఈ-ఇన్వాయిస్, క్యూఆర్ కోడ్ అమలు తేదీని ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 1కి పొడిగించారు.
* ఎగుమతిదారులకు ఈ-వాలెట్ స్కీమ్ అమలును సైతం 2021 మార్చి 31కి పొడిగించారు.
* జీఎస్టీ చెల్లింపుల్లో జాప్యానికి వడ్డీ విధింపును నికరంగా చెల్లించాల్సిన పన్నుపై విధించనున్నారు. ఈ నిర్ణయం 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా చట్టంలో సవరణలు చేయనున్నారు.
* ఈ ఏడాది మార్చి 14 వరకు రద్దయిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించారు. ఈ ఏడాది జూన్ 30లో రిజిస్ట్రేషన్ రద్దు ఉపసంహరణ అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది.
* జీఎస్టీ నెట్వర్క్ పరిధిలోని వ్యాపారులకు వస్తు సరఫరాదారుల వివరాలను తెలిపేందుకు వీలుగా ‘నీ సరఫరాదారు గురించి తెలుసుకో’ పేరుతో కొత్త వసతి ఏర్పాటుకు మండలి ఆమోదం తెలిపింది.