మహిళా సంఘాల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-05-23T06:49:22+05:30 IST
మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు.
రంపచోడవరం, మే 22: మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. రంపచోడవరంలో వందన్ వికాస కేంద్రాలు ఏర్పాటు చేసిన జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, పసుపు తయారీ, చింతపండు కేక్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ తయారు చేసిన జీడిపప్పు, పసుపు, చింతపండు తదితర మన్యం అటవీ ఉత్పత్తులను కాకినాడలో షాపు ఏర్పాటు చేసి విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ పత్తి విత్తనాలు సాగు చేసి గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. తొలుత స్థానిక పీఎంఆర్సీలో సెర్ప్ సీఈవోను ఐటీడీఏ పీవో ధనుంజయ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. సెర్ప్ డైరెక్టర్లు మహిత, కేశవ్, డీఆర్డీఏ పీడీ డేగలయ్య, ఏపీడీ శ్రీనివాసరావు, ప్రోగ్రాం మేనేజర్ బాలరెడ్డి, జీవీకే ప్రెసిడెంట్ అనిల్, ప్రోగ్రాం డైరక్టర్ బెన్ని, భద్రతాధికారి హరిచంద్ర, మినలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పీడీవో మురళి, డీపీఎంలు పరమేశ్వరరావు, మారుతి, ఏపీఎం దుర్గాప్రసాద్, ప్రసాద్, అప్పారావు పాల్గొన్నారు.