పిఠాపురం అమ్మాయి గ్రూప్-1 టాపర్
ABN , First Publish Date - 2022-07-06T06:28:45+05:30 IST
ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం ప్రకటించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టరు పరీక్షా ఫలితాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్ రాణి సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది.
డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన రాణి సుస్మిత
పిఠాపురం, జూలై 5: ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం ప్రకటించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టరు పరీక్షా ఫలితాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్ రాణి సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది. 1 నుంచి 10వ తరగతి వరకూ పిఠాపురం పట్టణంలోని ప్రియదర్శిని స్కూలులో ఆమె చదివింది. ఇంటర్మీడియట్ కాకినాడ ఆదిత్య కళాశాలలో, బీఎస్సీ వీఎ్స లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాలలో, పీజీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు. ఇక్కడ గోల్డ్మెడల్ సాధించి అప్పటి గవర్నర్ నరసింహన్ చేతులు మీదుగా అందుకున్నారు. తమిళనాడులోని తిరుచానపల్లి ఎన్ఐటీలో హెల్త్కేర్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామ్ ద్వారా యంగ్ అచీవర్స్ పురస్కారం కూడా పొందారు. ప్రస్తుతం హైదరాబాదులోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గ్రూప్-1 పరీక్షకు సొంతంగానే ప్రిపేర్ అయిన ఆమె ఇంటర్వూ సమయంలో మాత్రం గత గ్రూప్-1 టాపర్ నిషాంత్రెడ్డి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని పుస్తకాలు రాసినట్లు సుస్మిత చెప్పారు. టాప్-5లో ఉంటానని ముందు నుంచి అనుకున్నానని, అయితే మొదటి ర్యాంకు లభించడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. తన తాత పిఠాపురం పట్టణంలోని ఏకేపీఎం ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేసిన పేర్ని లక్ష్మీనరసింహమూర్తి, తన మావయ్య ‘మీలో ఎవడు కోటీశ్వరుడు’ విజేత ఉమాకాంత్, శ్రీకాంత్ల ప్రోత్సాహం, భర్త సహకారంతో ఇది సాధించగలిగానని రాణి సుస్మిత చెప్పారు. తనను కలెక్టరుగా చూడాలని తన తాత కన్న కల నెరవేరిందని చెప్పారు. తన వద్దకు వచ్చిన వారందరికీ ఎంతమేర కుదిరితే అంత మందికి సాయం చేయడమే తన లక్ష్యమని డాక్టర్ రాణి సుస్మిత తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తానని చెప్పారు.